జయలలిత ఎస్టేట్ లో హత్య: శశికళ ఫ్మామిలీకి మరో చిక్కు ! ఎందుకు నిలిపేశారు ?
జయలలిత కొడనాడు ఎస్టేట్ లోని ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న సీసీ కెమెరాల నిర్వహణ కొంత కాలం నుంచి నిలిపివేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. శశికళకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు ఆ ఎస్టేట్ బంగ్లా నిర్వహణ
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ లో పక్కా ప్లాన్ తో హత్య జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. రెండు వాహనాల్లో కొడనాడు ఎస్టేట్ లో ప్రవేశించిన నిందితులు చాకచక్యంగా తప్పించుకున్నారని అంటున్నారు.
జయలలిత ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చెయ్యడానికి సినిమా పక్కీలో ప్లాన్ వేశారని పోలీసు అధికారులు గుర్తించారు. హత్య చేసి పారిపోయే సమయంలో హంతకులు కొన్ని వస్తువులు వదిలి వెళ్లారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని బుధవారం దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ హత్య కేసులో శశికళ సన్నిహితులను విచారించడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారని సమాచారం.
నగలు, నగదు కోసం
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసును అనేకకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో జయలలితకు చెందిన బంగారు నగలు, భారీ మొత్తంలో నగదు ఉందని అనుమానంతో వాటిని లూటీ చెయ్యడానికి దుండుగులు ప్రయత్నించారని ఊహాగానాలు సాగుతున్నాయి.
చేతివాటం ప్రదర్శించారు
రెండు జీపుల్లో కొడనాడు ఎస్టేట్ లో ప్రవేశించే ముందే అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పోలీసులు గుర్తించారు. దుండగుల ముఠా మొదట విద్యుత్ సరఫరా కనెక్షన్ కట్ చేసి చేతివాటం ప్రదర్శించి ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాలు నిర్వహణకు చెక్
కొడనాడు ఎస్టేట్ ప్రవేశ ద్వారం దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదని పోలీసులు గుర్తించారు. జయలలిత కొడనాడు బంగ్లా నిర్వహకులు సీసీ కెమరాల వినియోగం నిలిపివేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.
అదే మొదటి అనుమానం
సీసీకెమెరాల నిర్వహణ ఎందుకు నిలిపి వేశారు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బంగ్లా నిర్వహకులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సీసీకెమెరాలు పని చెయ్యడం లేదని దుండగులకు ఎలా తెలిసింది ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
చెత్తకుప్పలో సాక్షాలు
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ ను హత్య చేసిన నిందితులు రెండు జీపుల్లో అక్కడి నుంచి పారిపోయారు. కొడనాడు సమీపంలోని కోటగిరి ప్రాంతంలోని చెత్త కుప్పలో నిందితులు రెండు వాహనాల నకిలి నెంబర్ ప్లేట్లు, చేతులు వేసుకున్న గ్లౌజులు విసిరివేసి వెళ్లారని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆసుపత్రిలో విచారణ
దుండగుల ముఠా దాడిలో గాయపడి కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాచ్ మెన్ కృష్ణ బహుదూర్ ను పోలీసు అధికారులు విచారించి వివరాలు సేకరించారు. కృష్ణ బహుదూర్ తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
శశికళ సన్నిహితులకు మరో గండం !
జయలలిత కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలను శశికళకు అత్యంత సన్నిహితులైన వారు చూసుకుంటున్నారని సమాచారం. ఆ ఎస్టేట్ లో జరిగిన హత్య కేసులో శశికళ సన్నిహితులను విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది. అదే జరిగితే శశికళ ఫ్యామిలీకి మరో గండం ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.