రైతు ఆత్మహత్య: 'ఏఏపీ డ్రామా బెడిసి కొట్టింది, ప్రాణం తీసింది!'
న్యూఢిల్లీ: రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) ఆమ్ ఆద్మీ పార్టీ పైన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆత్మహత్య నాటకానికి ఏఏపీ తెర తీయబోయిందని, చివరకు అది విషాదాంతమైందని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ సంపాదకీయంలో దుయ్యబట్టింది.
ఇకనైనా ఏఏపీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికింది. కేంద్రం తెస్తున్న భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా జంతర్మంతర్వద్ద ఏఏపీ ర్యాలీలో పాల్గొనే క్రమంలో రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏఏపీ సభను అత్యంత దిగజారిన రాజకీయ ఎత్తుగడగా ఆర్గనైజర్ అభివర్ణించింది.
ఎప్పటిలాగే ఏఏపీ దేశ రాజకీయాలకు తనదైన విశిష్ట వినోదాన్ని అందించిందని ఎద్దేవా చేశారు. 24గంటల మీడియా కవరేజీతో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అన్ని దారులూ తొక్కుతోందని, నినాదాలు గుప్పించేవారిలోనో, నాయకత్వంలో ఉన్నవారిలోనో భాగంగా గల కొందరు నాటకకర్తలు ఎన్నికల రాజకీయాల్లో గిమ్మిక్కులు చేస్తుంటారని, గరీబీ హఠావో నుంచి అచ్ఛేదిన్ వరకు గల నినాదాలు ఓటర్ల హృదయాలను తాకుతాయన్నారు.
కానీ, రైతు ఆత్మహత్య పేరిట నీచమైన అట్టడుగుస్థాయిని ఏఏపీ తాకిందని దుయ్యబట్టింది. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆత్మహత్యకు రైతు ప్రయత్నిస్తున్నట్టు మీడియా ద్వారా ప్రజలను భ్రమింపజేయాలని ఏఏపీ ప్రయత్నించగా ఆ రైతు నిజంగానే చనిపోవడం నీచ రాజకీయానికి నిదర్శనమని విమర్శించింది.
మరోవైపు, గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై సుప్రీం కోర్టులో ప్రజాహి వ్యాజ్యం దాఖలైంది. ఈ ఉదంతంపై దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని జీఎల్ మణి అనే న్యాయవాది కోర్టును కోరారు. అలాగే అకాల వర్షాలతో పంటనష్టం తీవ్రంగా ఉంటున్నదని, విపత్తుల నివారణకు సమగ్ర జాతీయ ప్రణాళికను చేపట్టేలా కేంద్రాని ఆదేశించాలని కోరుతూ మరో పిల్ దాఖలైంది.