రైతులపై ఇలానా?: ఆత్మహత్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతులను పరామర్శించడానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మందసౌర్ వెళ్లిన రోజే.. భూపేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భోపాల్: గిట్టుబాటు ధర కోసం.. రుణమాఫీ కోసం.. రైతన్నలు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే.. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మంత్రికి మాత్రం అవి వ్యక్తిగతమే అన్నట్లుగా కనిపించాయి. రైతులు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డా. వాటి వెనుక కూడా వ్యక్తిగత కారణాలే ఉండవచ్చునేమో అని నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ హోంమత్రి భూపేందర్ సింగ్ బుధవారం నాడు రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాంటే.. కేవలం అప్పులే దానికి కారణం అనుకోవడానికి లేదు. వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు'అంటూ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యమే అన్న ఆరోపణను కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.'
పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతులను పరామర్శించడానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మందసౌర్ వెళ్లిన రోజే.. భూపేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మందసౌర్ లో పోలీసుల కాల్పులు జరపలేదని తొలుత బుకాయించిన భూపేంద్ర సింగ్.. ఆ తర్వాత రెండు రోజులకు మాట మార్చారు. పోలీసుల కాల్పుల్లోనే ఐదుగురు రైతులు మృతి చెందారని చెప్పారు.
ఇదిలా ఉంటే, సమస్యల పరిష్కారం కోసం రైతులంతా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలు, నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పలు బస్సులు, ద్విచక్ర వాహనాలు ఈ గొడవల్లో దగ్దమయ్యాయి. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఐదుగురు రైతులు సైతం ప్రాణాలు కోల్పోయారన్న విమర్శ ఉంది.