ఒంటరిగా ఫీలవుతున్నా!.. అమ్మ పుట్టినరోజున ఇలా చేయండి: శశికళ సందేశం
ఇక జయలలితతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. గతేడాది జయలలిత కన్నుమూయడంతో అప్పటినుంచి ఒంటరిగా ఫీలవుతున్నానని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై: జైలు నుంచే పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ తాజాగా పార్టీ వర్గాలకు ఒక సందేశం పంపించారు. ఫిబ్రవరి 24న దివంగత సీఎం జయలలిత పుట్టినరోజు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అమ్మ జయంతిని ఘనంగా నిర్వహించాలని శశికళ పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.
అమ్మ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని, ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని శశికళ పార్టీ నేతలకు గుర్తుచేశారు. అమ్మ స్పూర్తితో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలని, అవిశ్రాంతంగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
అమ్మ జయంతి సందర్బంగా తమిళనాడులో సామూహిక అన్నదానాలు చేయాలని, అభిమానుల సందర్శనార్థం జయలలిత ఫోటోను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించాలని కార్యకర్తలను కోరారు. సవాళ్లను ఎదుర్కొనే విషయంలో అమ్మను స్పూర్తిగా తీసుకోవాలని, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు.
ఇక జయలలితతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. గతేడాది జయలలిత కన్నుమూయడంతో అప్పటినుంచి ఒంటరిగా ఫీలవుతున్నానని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. జయలలితతో దాదాపు 33సంవత్సరాలు కలిసి ఉన్నామని, ప్రతీ ఏటా అమ్మ పుట్టినరోజును ఉత్సాహంగా జరపుకునేవారమని, ఈ సారి ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు.
1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు అనేక సవాళ్ల మధ్య పార్టీ పగ్గాలు చేపట్టి, సమయస్పూర్తిగా పనిచేసిన ఘనత జయలలితకే దక్కుతుందన్నారు. ప్రేమ, దయ, కష్టపడే తత్వం ఆమెను ప్రత్యేకంగా నిలిపాయని గుర్తుచేశారు.