ఖాకీ వద్దు: ఖద్దర్కు జై కొట్టిన మహిళా పోలీసు
బెంగళూరు: ప్రభుత్వ అధికారులు వారి ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి లోక్ సభ, శాసన సభ ఎన్నికలలో పోటి చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఒకరు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో పోటి చెయ్యడానికి సిద్దం అయ్యారు.
అందుకు ఆమె ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. బెంగళూరు నగరంలోని శ్రీనగర్ వార్డు-156 నుండి బీజేపీ అభ్యర్థిగా జే.ఎం. సవిత నామినేషన్ వేశారు. రాజకీయాలలోకి వచ్చి ప్రజా సేవ చెయ్యడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశానని సవిత అంటున్నారు.
12 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసిన సవిత రాజకీయాలలోకి అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. 2003 నుండి 2006 వరకు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో సవిత కానిస్టేబుల్ గా పని చేశారు.
తరువాత 2006 నుండి 2015 వరకు డీజీపీ కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వహించారు. రాజకీయాలలోకి రావడానికి గల కారణాలను సవిత వివరించారు. తన తండ్రి 24 సంవత్సరాలు వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసి స్వచ్చంద పదవి విరమణ చేశారని అన్నారు.
తరువాత ఆయన సమాజసేవలో నిమగ్నం అయ్యారని అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం చేసిన తను పట్టబద్దురాలని సవిత చెప్పారు. తనకు ప్రజా సేవ చెయ్యాలని ఆశగా ఉందని అందుకే రాజకీయాలలోకి వచ్చానని అంటున్నారు.
విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సవితకు పార్టీ టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పటికే నామినేషన్ వేసిన సవిత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి కే.ఎం. లావణ్య పోటిలో ఉన్నారు. గతంలో జరిగిన కార్పొరేటర్ ఎన్నికలలో జేడీఎస్ కు చెందిన తిమ్మేగౌడ ఇదే వార్డును గెలుపోందారు.