సినీ తారలకు పార్టీ పదవులు ఇస్తున్న బీజేపీ
చెన్నై: బీజేపీ జాతీయ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులకు బీజేపీలో ఉన్నత పదవులు కట్టబెట్టి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు సంగీత దర్శకుడు, గాయకుడు గంగై అమరన్, కేంద్ర మాజీ మంత్రి, బహుబాష నటుడు నెపోలియన్ తదితరులు ఆ జాబితాలో చేరారు. పార్టీలో వీరికి ఉన్నతమైన పదవులు అప్పగిస్తూ పార్టీ అభివృద్ది కోసం పని చెయ్యాలని సూచిస్తున్నారు.
ఇళయరాజ సోదరుడు గంగై అమర్ సంగీత దర్శకుడు, గాయకుడు. గంగై అమరన్ పలు సినిమాలకు సంగీతం అందించారు. గంగై అమరన్ ను కళల విభాగానికి ప్యాట్రన్ గా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.
2016 సంవత్సరంలో తమిళనాడులో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా పార్టీ ప్రముఖులకు తాము పదవులు అప్పగిస్తున్నామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు టి. సౌందరరాజన్ తెలిపారు.
అదే విదంగా ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజాకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహకుడిగా, కళల విభాగం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. కళల విభాగం కార్యదర్శిగా ప్రముఖ నటి గాయిత్రీ రఘురామ్ ను నియమించారు.
బీజేపీ ప్రచార విభాగం (తమిళనాడు) ఉపాధ్యక్షురాలిగా నటి, నిర్మాత కుట్టి పద్మినిని నియమించారు. ఎన్నికల విభాగం అధ్యక్షుడిగా అన్నా డీఎంకే మాజీ ఎంపీ ఎస్. మలై స్వామిని నియమించారు.