గుర్రం కాళ్లు విరగ్గొట్టిన ఎమ్మెల్యే: సినీ తార త్రిష పైర్
హైదరాబాద్: దక్షిణ భారత అందాల తార త్రిష గిరిగీసుకోకుండా సామాజిక, రాజకీయాంశాలపై కూడా స్పందిస్తున్నారు. ఆమె ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.
వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా సామాజికాంశాల మీద ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తన అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ బిజెపి ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనపై త్రిష స్పందించారు. త్రిష తన ట్విట్టర్ పేజీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని ఉద్దేశిస్తూ నీకు నరకంలోనైనా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నాను, ఇది సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు.
Yes i pray u burn in hell !! Absolutely ashamed. https://t.co/OeY3Kg8ynv
— Trisha Krishnan (@trishtrashers) March 15, 2016
ఉత్తరాఖండ్లో బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి క్రూరంగా ప్రవర్తించాడు. ఓ పోలీసు గుర్రాన్ని చితకబాదాడు. బలమైన దెబ్బలకు ఆ అశ్వం విలవిలలాడింది. దాని వెనుక కాళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడా ఆ మూగజీవి లేవలేని స్థితిలో ఉంది. ఆ గుర్రం కాళ్లను తొలిగించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.
ఆ రాష్ట్ర సీఎం హరిశ్ రావత్కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ముందు భారీ ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. అశ్వ దళాలు ఆ నిరసన ప్రదర్శనను నియంత్రించేందుకు ప్రయత్నించాయి. ఆ దశలో ముస్సోరీ ఎమ్మెల్యే జోషి ఓ లాఠీతో గుర్రంపై దాడి చేశాడు.