శశికళ ఔట్, ఆర్థిక శాఖ: పన్నీరు డిమాండ్లు, సంక్షోభంలో సీఎం పళని
దినకరన్పై ఢిల్లీలో కేసు నేపథ్యంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువర్గాలు కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు. శశికళ జైలుకు వెళ్లడం, రెండాకుల గుర్తు కోసం ఈసీకి
చెన్నై: దినకరన్పై ఢిల్లీలో కేసు నేపథ్యంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువర్గాలు కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు. శశికళ జైలుకు వెళ్లడం, రెండాకుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్లు ఇచ్చేందుకు దినకరన్ ప్రయత్నించడం శశికళ వర్గంలో కలకలం రేపుతోంది.
దినకరన్ అరెస్ట్కు రంగం సిద్ధం!
దీంతో శశికళ వర్గం చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారం పన్నీరుసెల్వం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో శశికళను, దినకరన్ను పక్కన పెట్టాలని శశికళ వర్గంలోని మంత్రులు, నేతలు కూడా పట్టుబడుతున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
శశికళ వర్గం ఎదుట పన్నీరు షరతులు
అదే సమయంలో పన్నీరుసెల్వంతో కలవాలని కోరుకుంటున్నారు. ఇరు వర్గాలు కలవాలంటే పన్నీరుసెల్వం శశికళ వర్గం ముందు రెండు షరతులు పెట్టారు. ఒకటి తమకు ఆర్థిక శాఖను ఇవ్వాలని, మరొకటి శశికళను పార్టీ అధినేత్రిగా ఉంచకూడదని డిమాండ్లు పెట్టారు.
అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను కలిపేందుకు ఓ కమిటీ ఫాం అయింది. పన్నీరుసెల్వంతో చర్చలు జరపనున్నారు. ఇరువర్గాలు చర్చలు కూడా జరుపుతున్నాయి. తాను చర్చలకు సిద్ధమని పన్నీరుసెల్వం కూడా చెప్పారు.
శశికళను, కుటుంబాన్ని దూరం పెట్టాలని పన్నీరు డిమాండ్
అయితే, తనతో చర్చలకు ముందే ప్రధానంగా రెండు డిమాండ్లను ఆ కమిటీ ముందు పన్నీరుసెల్వం ఉంచారు. అజెండాలో శశికళను పార్టీ పదవి నుంచి, పార్టీ నుంచి బయటకు పంపించడమే ప్రధాన అజెండాగా ఉండాలని తొలి డిమాండ్ పెట్టారు. శశికళ కుటుంబాన్ని కూడా పార్టీకి దూరం పెట్టాలన్నారు. అదే సమయంలో శశికళ స్థానంలో పన్నీరును పార్టీ అధినేతగా చేయాలని చెప్పారు.
పళని సీఎంగా ఉండాలి, పన్నీరుకు ఆర్థిక శాఖ ఇవ్వాలి
అలాగే, ఇరువర్గాలు ఒక్కటయ్యే సమయంలో ముఖ్యమంత్రి పదవిపై తమకు పట్టు లేదని, కానీ పన్నీరు సెల్వంను కేబినెట్లోకి తీసుకోవాలని, ఆయనకు ఆర్థిక శాఖను అప్పగించాలని మరో డిమాండ్ పెట్టారు.
పళనిస్వామియే ముఖ్యమంత్రిగా ఉండాలని పన్నీరు చెప్పారు. ప్రస్తుతం మంత్రి జయకుమార్ ఆర్థిక శాఖ ఉంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిస్తే.. పన్నీరుసెల్వంకు ఆర్థిక శాఖ దక్కనుంది. జయలలిత హయాంలోను పన్నీరు వద్ద ఇదే శాఖ ఉంది.
ఎవరెటు?
మరోవైపు, ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరకుంటే.. అధికార పార్టీలోని సీనియర్ మంత్రులు, నాయకులు పన్నీర్ వర్గంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ఇతరులపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు, టీటీవీ దినకరన్పై లంచం కేసు నమోదు అధికార పార్టీలోని దినకరన్ వ్యతిరేకులను ఆలోచింపజేస్తున్నట్లు చెబుతున్నారు.
పన్నీరు వైపు దూకేందుకు సిద్ధం
ప్రభుత్వంలోని కొందరు సీనియర్ మంత్రులు, నాయకులు పన్నీర్సెల్వం వైపు దూకడానికి సిద్ధమవుతున్నారని, ఫలితంగా పళనిస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నెల 19న కీలక ప్రకటన ఉంటుందని పన్నీర్ సెల్వం వర్గం నేతలు చెబుతున్నారు.
శశికళకు వ్యతిరేకంగా..
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని సాగుతున్న వివాదంలో పన్నీర్సెల్వం మద్దతుదారులు మైత్రేయన్, పీహెచ్ మనోజ్ పాండియన్ తదితరులు సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘానికి తమ తరఫున అఫిడవిట్, ఇతర ఆధార పత్రాలను సమర్పించారు.
గతంలో ఎన్నికల సంఘం వీటిని సోమవారంలోగా సమర్పించమని కోరింది. ఇదే విషయంలో పూర్తిస్థాయి పత్రాలు సమర్పించేందుకు శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఎనిమిది వారాల సమయం కోరడం గమనార్హం.