అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఎక్కడున్నాడో తెలియదు: హోంమంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో వివరాలేమీ తమకు తెలియదని మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకుగాను హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరీభాయి పరాటీభాయి చౌదరి ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
దావూద్పై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి సైతం తమకు నోటీసులు అందాయని తెలిపారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అతని కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ తెలిపారు. ఇప్పటి వరకు దావూద్ జాడ కనుగొనలేదని స్పష్టం చేశారు.
దావూద్ను పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, అయితే ఇందుకు పాకిస్థాన్ నుంచి సరైన సహకారం అందడం లేదని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, 1993 మార్చి 12వ తేదిన ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లను సృష్టించింది గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీమనే ఆరోపణలు వచ్చాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించారు. సుమారు 700 మందికి తీవ్రగాయాలైనాయి.
కాగా, దావూద్ ఇబ్రహీం గురించి ప్రాణభయం పట్టుకున్న దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని తనకు మూడు సార్లు ఫోన్ చేసి చెప్పాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై వరస బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో సీబీఐ డీఐజీగా నీరజ్ కుమార్ పని చేస్తున్నారు. ఆ సమయంలో తనకు దావూద్ ఇబ్రహీం మూడు సార్లు ఫోన్ చేసి లోంగిపోతానని మనవి చేశాడని అన్నారు.
తను భారత్ వస్తే ప్రత్యర్థులు అంతం చేస్తారని అందుకే లొంగిపోవడానికి సిద్దం అయ్యానని చెప్పాడని సమాచారం. అయితే కొన్ని కారణాల వలన సీబీఐ దావూద్ ఇబ్రహీం ఆఫర్ ను తిరస్కరించిందని మాజీ పోలీసు అధికారి నీరజ్ కుమార్ అంటున్నారు. తరువాత ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానిని పోలీసు అధికారుల దగ్గరకు పంపించి లొంగిపోతానని రాయబారం నడిపాడని నీరజ్ కుమార్ అంటున్నారు.
ఆది ఇలా ఉండగా, నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మాజీ సిబిఐ చీఫ్ విజయ రామారావు ఖండించారు. తాను సిబిఐ చీఫ్గా ఉన్నప్పుడు దావూద్కు సంబంధించిన ఏలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. దావూద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు గాలిస్తున్నాయని, అటువంటి దావూద్ లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయరామారావు అన్నారు. దావూద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.