ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కష్టకాలం మొదలయ్యింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద కేసు నమోదు చేసిన లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప (బీజేపీ), హెచ్.డి. కుమారస్వామి (జేడీఎస్)ల మీద కేసు నమోదు చేశారు.
బెంగళూరు నగరంలోని గంగేనహళ్ళి సమీపంలోని మఠదహళ్ళి లేఔట్ లో 1.11 ఎకరాల పోలాన్ని అక్రమంగా డీనోటిఫికేషన్ చేశారని ఆరోపిస్తూ కుమారస్వామి, యడ్యూరప్పల మీద ఆర్ టీఐ కార్యకర్త జయకుమార్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డినోటిఫికేషన్ కు సంబంధించిన పత్రాలు లోకాయుక్త అధికారులకు అందించారు. కేసు విచారణ చేసిన లోకాయుక్త అధికారులు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, యడ్యూరప్పతో పాటు విమల, టి.ఎస్. చెన్నప్ప, రాజశేఖరయ్య అనే ఐదు మంది మీద సెక్షన్ 13(1) సి,డి, ఐపీసి 409, 418, 420,120 బి సెక్షల కింద ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మఠదహళ్ళి సర్వే నెంబర్ 7/1బి,7/1సి,7/1డి లోని మొత్తం 1.11 ఎకరాల పోలాన్ని డి నోటిపికేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పోలానికి అసలు యజమాని తిమ్మారెడ్డి. అయితే రాజశేఖరయ్య అనే వ్యక్తి ఈ పొలానికి తానే యజమాని అని 2007లో రికార్డులు సంపాదించాడు.
ఈ పొలాన్ని డి నోటిఫికేషన్ చెయ్యాలని అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామికి అర్జీ సమర్పించారు. కుమారస్వామి అర్జీని నగరాభివృద్ది శాఖకు పంపించారు. అప్పటి నగరాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి సుబీర్ హరి సింగ్ డి నోటిఫికేషన్ చెయ్యడానికి వీలుకాదని స్పష్టం చేశారు.
2008లో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పొలాన్ని విమల అనే మహిళ పేరుతో జీపీఏ చేయించారు. తరువాత విమల తన కుమారుడు చెన్నప్ప పేరుతో గాంధీనగర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పొలం రిజిస్టర్ చేయించారు.