రావణుడిపై సుబ్రమణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు, ఎఫ్ఐఆర్కి నమోదుకి కాంగ్రెస్ నేత డిమాండ్
న్యూఢిల్లీ: లంకాధీశుడు రావణుడు, ఆయన భార్య మండోదరి ఉత్తరప్రదేశ్కు చెందిన దళితులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ యూత్ కాంగ్రెస్ లీడర్, మానవ హక్కుల నేత షహద్ పునావాల్ల డిమాండ్ చేశారు.
వెనుకబడిన తరగతుల వారికి చెందిన జాతీయ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పూనియాతో పాటు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొన్నారు. కులాల పేరుతో సుబ్రమణ్య స్వామి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'ఐ అండ్ మై ఇండియా' కార్యక్రమంలో సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ, రావణుడు ఘజియాబాద్ సమీపంలోని బస్రఖ్ ప్రాంతంలో జన్మించాడని, మండోదరి మీరట్ ప్రాంతానికి చెందినదని వివరించారు. రావణుడు, మండోదరి దళితులని, వారు ఉత్తరప్రదేశ్కు చెందినవారని అన్నారు.
శివుడి ఆశీస్సులతో రావణుడు లంకను చేజిక్కించుకున్నాడని స్వామి తెలిపారు. ఈ వివరాలను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయాలని సూచించారు. దేశీయ, విలువ ఆధారిత విద్యా వ్యవస్థ ఉన్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.
ఇక, భారత్లో జన్మించిన వారందరూ హిందువులేనని, వారి డీఎన్ఏ పరీక్షిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయం దేశంలోని ముస్లింలకు కూడా తెలుసని అన్నారు. సుబ్రమణ్య స్వామిపైన పేర్కొన్న ప్రకటనలు కులతత్వంతో చెప్పారని... భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఈ ప్రకటనలు ద్వేషం ప్రేరేపితంగా ఉన్నాయని, నిందితుడు ఢిల్లీలో నివసిస్తూ ఉత్తరప్రదేశ్లో ప్రకటనలు చేయడం వల్ల ఆ ప్రభావం దేశంలోని మిగతా దళితులపై పడుతుందన్నారు. ప్రాదేశిక అధికార పరిధిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పోలీసులు లేదా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కంప్లైంట్లో పేర్కొన్నారు.