కాల్పులతో అట్టుడుకుతున్న కాశ్మీర్: 7గురు ఉగ్రవాదులు హతం, పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం ఆదివారం ఉదయం నుంచి కాల్పులతో అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు కూడా మృతి చెందాడు. మరో ఆరుగురు బద్రతాదళ అధికారులు గాయపడ్డారు.
పూంచ్ జిల్లాలో ఆదివారం ఉదయం 7.30 మొదలైన ఎదురుకాల్పులు రోజంతా కొనసాగాయి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయం వద్ద నక్కిన ఉగ్రవాదులు.. గస్తీ తిరుగుతున్న పోలీసు బృందంపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ భవనానికి చేరువలోనే సైన్యానికి చెందిన 93వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ఉంది.
ఉగ్రవాదులు ఆ తర్వాత విడిపోయి.. ఒక ఇంట్లోకి, మినీ సచివాలయానికి చేరువలోని ఒక భవనంలోకి చొరబడ్డారు. ఉగ్రవాదులు చొరబొడ్డ ఇంట్లో హాజీ నజీర్ మీర్, ఆయన భార్య ముంతాజ్ మీర్ ఉన్నారు. హాజీ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జహంగీర్ హుస్సేన్ మిర్కు సమీప బంధువు. ఈ వృద్ధ జంటను ముష్కరులు బందీలుగా తీసుకున్నారు.
సైన్యానికి చెందిన మెరుపు దళాలు రంగప్రవేశం చేసి, ఉగ్రవాదులపై ప్రతిదాడిని ప్రారంభించాయి. వృద్ధ జంటను క్షేమంగా విడిపించాయి. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాగా, ఈ ఎన్కౌంటర్లో రాజేందర్ కుమార్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు సైనికులు, ఎస్సై సహా ముగ్గురు పోలీసులు, ఒక పౌరుడు కూడా గాయపడ్డారు.
ఉగ్రవాదుల జాడను పసిగట్టడానికి డ్రోన్లను కూడా వాడారు. ఘటనా స్థలాలను చుట్టుముట్టిన భద్రతా దళాలు.. ఆదివారం రాత్రి కూడా గాలింపు కొనసాగింది. మరోవైపు నియంత్రణ రేఖ వద్ద మూడు వేరువేరు ప్రదేశాల్లో చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
నౌగామ్, తాంగ్ధర్, గురేజ్ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకు న్నాయి. ఉగ్రవాదుల నుంచి నాలుగు ఎ.కె-47 తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది.
సోమవారం ఉదయం మళ్లీ కాల్పులు
పూంచ్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. మినీ సచివాలయం వద్ద ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. భారీగా బలగాల మోహరించాయి.