జైల్లో శశికళ తొలిరోజు ఇలా గడిచింది.. రాత్రంతా ఉపవాసమే
ఉదయం 6.30గం.కు బ్రేక్ ఫాస్ట్ లో వెజిటెబుల్ పలావ్ తిన్నాక జైల్లోని గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడ కొన్ని ఇంగ్లీష్, తమిళ దినపత్రికలు చదివారు.
బెంగుళూరు: ఊహించినట్టుగానే జైలు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ. ఆమె జైలుకు వెళ్లి ఒకరోజు పూర్తవడంతో అటు మీడియా ఇటు జనం ఆమె జైలు జీవితం ఎలా మొదలైందన్న దానిపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
బుధవారం సాయంత్రం పరప్పన్ జైలుకు చేరిన శశికళ ఆరోజు రాత్రి ఏమి తినకుండానే పడుకున్నారు. జైలు సిబ్బంది ఆమెకు రెండు రోటీ, సాంబారు ఇచ్చినా.. తినేందుకు శశికళ ఇష్టపడలేదు. నిబంధనల ప్రకారం నేలపై చాప, దిండు వేసుకుని రగ్గు కప్పుకుని పడుకున్నారు. గురువారం నాడు తెల్లవారుజామున 5.30గం.కే లేచి కాలకృత్యాలు ముగించి ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైలులోనే వాకింగ్ చేశారు.
ఉదయం 6.30గం.కు బ్రేక్ ఫాస్ట్ లో వెజిటెబుల్ పలావ్ తిన్నాక జైల్లోని గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడ కొన్ని ఇంగ్లీష్, తమిళ దినపత్రికలు చదివారు. అనంతరం కొద్దిసేపు బ్యారెక్ లో విశ్రాంతి తీసుకున్నారు.
ఇక సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇళవరసితో కలిసి టీ తాగారు. ఆపై తోటి ఖైదీలతో మాటల్లో పడిపోయారు. శశికళను కలిసేందుకు తమిళనాడువ్యాప్తంగా పలువురు పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. గురువారం నాడు పలు జిల్లాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు ఆమెను పరామర్శించేందుకు రాగా.. పోలీసులు జైల్లోకి అనుమతివ్వలేదు.
కాగా, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడపాడి కె.పళనిస్వామి శుక్రవారం ఉదయం శశికళను కలవనున్నారు.