ఇక మహారాష్ట్ర రోడ్లపై ఎలక్ట్రానిక్ టాక్సీలు, వాటి ప్రత్యేకత ఇదీ...
మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలోకి కాలుష్య రహిత వాహనాలు రాబోతున్నాయి. కేవలం విద్యుత్ సాయంతో వీటిని నడుపుతారు.
న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలోకి కాలుష్య రహిత వాహనాలు రాబోతున్నాయి. కేవలం విద్యుత్ సాయంతో వీటిని నడుపుతారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే విదేశాల నుంచి ప్రత్యేకించి గల్ఫ్ దేశాల నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి తప్పుతుంది మరి.
అంతా ఊహించినట్లే జరిగితే ఈ నెల 26న అవి రోడ్ల మీదకు రానున్నాయి.అదే రోజు ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. ఎన్డీయే ప్రభుత్వ త్రుతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ ట్యాక్సీలను ప్రారంభించనున్నారు.
కేంద్ర ఉపరితల రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గంలో యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్ అందిస్తున్న 'ఓలా' సంస్థ సాయంతో ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటితోపాటు కొన్ని విద్యుత్ ఇంధనంగా నడిచే బస్సులను కూడా ప్రారంభించనున్నారు.
ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర అధికారులు హాజరు కానున్నారు. ఒక వేళ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా ఆధ్వర్యంలో 200 ట్యాక్సీలు తయారు చేశారు. ఈ ప్రాజెక్టును నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ ట్యాక్సీలను నాగ్ పూర్ విమానాశ్రయం వద్ద ప్రారంభిస్తారు. మహారాష్ట్ర పరిధిలో ఈ వాహనాలు కాలుష్యం తగ్గించడంతోపాటు విదేశాల నుంచి ముడి చమురుపై దిగుమతిపై ఆధారపడే పరిస్థితిని తప్పిస్తాయి.
2030 నాటికి విద్యుత్ వినియోగ వాహనాల దిశగా..
2030 నాటికి విద్యుత్ వినియోగ వాహనాలకు మళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ట్యాక్సీలకు అవసరమైన విద్యుత్ చార్జీ చేసుకోవడానికి నాగ్ పూర్ లో రెండు రకాల చార్జింగ్ పాయింట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేగంగా, నెమ్మదిగా చార్జింగ్ ప్లాంట్లు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 20 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కేవలం గంట వ్యవధిలోనే పూర్తిస్థాయిలో వాహనం రీచార్జి చేసుకుంటుంది.
అధిక ధర, చార్జింగ్, చార్జీ కారణంగా ఆర్థికంగా ఇబ్బందికరమా?
కానీ నిత్యం చార్జింగ్కు సమయం కేటాయించడంతోపాటు విద్యుత్ చార్జింగ్ బ్యాటరీ ట్యాక్సీలకు అధిక ధర చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా లాభదాయకం కాదని విశ్లేషకులు అభిప్రాయ పడ్తున్నారు. మహారాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి ఖాతువా సారథ్యంలోని కమిటీ ట్యాక్సీ చార్జీలు ఖరారు చేయనున్నది. ఈ కమిటీ నిర్దారిత చార్జీలే ప్రాతిపదికగా యాప్ బేస్డ్ సర్వీస్ ద్వారా ట్యాక్స్లు నడుపుతారు. ఈ - ట్యాక్సీల్లో చార్జీలను ఈ కమిటీయే ఖరారు చేస్తుందని చెప్తున్నారు.
2014లోనూ ఈ - ట్యాక్సీల ప్రారంభానికి ప్రతిపాదన
మూడేళ్లుగా ఎలక్ట్రిక్ ట్యాక్సీలను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగాయి. 2014 జనవరి 18వ తేదీన తొలిసారి రాష్ట్ర రవాణా సంస్థ (ఎస్టీఏ) ఏర్పాటు చేసే అంశం తొలిసారి చర్చకు వచ్చింది. కానీ నాగ్ పూర్ లో విద్యుత్ ఇంధన ఆధారిత బ్యాటరీలతో కూడిన ట్యాక్సీల ప్రారంభానికి ముందు ఎస్టీఏ ఒక్కసారి కూడా సమావేశం కాకుండానే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కనీసం వారం ముందు అయినా ఎస్టీఏ సమావేశం కావడానికి అవకాశం ఉన్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు.
ఈ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్
ఎస్టీఏ తీర్మానంతో బ్యాటరీతో పనిచేసే ట్యాక్సీలు 'ఈ - ట్యాక్సీ'గా రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నాయి. ఒక్కో ట్యాక్సీలో ఐదారుగురు వ్యక్తులతోపాటు వారి లగేజీ తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. విద్యుత్ బ్యాటరీతో నడిచే వాహనాలు ప్రస్తుతం మార్కెట్లో 'మహింద్రా - ఇ వెరిటో', 'మహింద్రా ఈ2 ఓ ప్లస్' మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆర్టీవో వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర సిటీ ట్యాక్సీ రూల్స్ 2017 ప్రకారం ఈ విద్యుత్ బ్యాటరీ ఇంధన వాహన ఇంజన్లు.. డీజిల్తోపాటు పెట్రోల్ సాయంతో నడిచే 980సీసీ సామర్థ్యం గల ఇంజన్లతోపాటు సమానం. ఈ వాహనాలన్నీ బ్లాక్ అండ్ ఎల్లో క్యాబ్లుగా రిజిస్టర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాల్లో ఇంజిన్ కనీస సామర్థ్యం 980సీసీ ఉండాలన్న నిబంధన కష్ట సాధ్యం కానున్నది.
విద్యుత్ వినియోగంపై ఎఆర్ఎఐతో ఎస్టీఏ సంప్రదింపులు
బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాల్లో కనీస విద్యుత్ అందుబాటులో ఉండేందుకు వీలుగా అనుసరించాల్సిన వ్యూహం ఖరారుపై ఎస్టీఏ.. పుణెలోని ఆటోమేటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఎఐ)ని సంప్రదించి.. అక్కడ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ వాహనాల ఇంజిన్ సామర్థ్యం నిర్ధారించారు. 2915 మే తొమ్మిదో తేదీన ఎస్టీఏ 'ఈ - ట్యాక్సీ'ల్లో ఇంజిన్ సామర్థ్యం కనీసం 980 సీసీగా ఉండాలని స్పష్టతనిచ్చింది.
వాహనాలకు ఎఆర్ఎఐ, సీఐఆర్టీ ధ్రువీకరణ తప్పనిసరి
ఎస్టీఏ తీర్మానం ప్రకారం ఈ వాహనాల తయారీ దారులు ఎఆర్ఎఐ, సీఐఆర్టీ వంటి సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెలుసుకున్నాయి. ఈ వాహనాల ఇంజిన్ల సామర్థ్యం 980సిసి నుంచి 1400 సీసీ సమానమైన సామర్థ్యం గలవని సదరు ఉత్పాదక సంస్థలు ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందాలని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.