కాశ్మీర్ లో వరదల భీభత్సం: జీలం నది ఉగ్రరూపం, 8 మంది మృతి
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లో వరదలు భీభత్సం స్పృష్టిస్తున్నాయి. గత మూడు రోజులతో పాటు ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా జీలం నది పొంగిపోర్లుతున్నది. చాలకాలం తరువాత జమ్మూ కాశ్మీర్ లో వరదలు వచ్చాయి. జీలం నది కనీస సాధారణ నీటి మట్టాన్ని దాటి శ్రీనగర్ లోని సంగం ప్రాంతాన్ని ముంచేసింది.
వరదల ధాటికి శ్రీనగరలో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం అర్దరాత్రి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. అధికారులకు సంఘటనా స్థలాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మనవి చేసింది.
జీలం నది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఆదివారం రాత్రి వర్షం నిలిచిపోయింది. అయితే వారం రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించారు.
వచ్చే 10 రోజులు ఉత్తర భారతంలోని పర్వతాలు అన్ని తేమగా ఉండొచ్చని అధికారులు అన్నారు. సాధారణంగా జీలం నది సంగం ప్రాంతంలో 21 అడుగులు, రామ్ మున్షి ప్రాతంలో 18 అడుగులు ప్రవహిస్తే ప్రమాద సూచికలను ప్రకటిస్తారు. అయితే ఇప్పడు సంగంలో 22.4 అడుగులు, రామ్ మున్షిలో 18.8 అడుగుల ఎత్తులో జీలం నది ప్రవహిస్తున్నది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తి మహమ్మద్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. వరదబాధితులను ఆదుకొవాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీనగర్ లో సైనికులు సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
8మంది మృతి
వరద బీభత్సం వల్ల ఎనిమిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మధ్య కాశ్మీర్లో వరదలతో ఇళ్లు కూలిపోవడం వల్ల వారు మృతి చెందారని సమాచారం. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి పైన కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.