'వరద నీరే ప్రమాదానికి కారణం, 300 మందిని కాపాడాం'
హర్దా: భారీవర్షాలకు పట్టాలు కొట్టుకుపోవడం వల్లనే మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు జరిగినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ ఎ.కె. మిత్తల్ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టాలపైకి వరదనీరు రావడంతో రైలు ప్రమాదం జరిగిందని అన్నారు.
భారీగా వరదలు సంభవించిన నేపథ్యంలో నీరు పట్టాలపైకి చేరిందన్నారు. దీంతో పట్టాల మధ్య మట్టి కూరుకుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ఈ రెండు రైళ్ల ప్రమాదానికి గల కారణాలను తెలియజేయాలంటూ రైల్వేశాఖ విచారణకు ఆదేశించిందని ఎ.కె. మిత్తల్ వెల్లడించారు.
మధ్యప్రదేశ్లోని రాజధాని భోపాల్కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా - హర్దా స్టేషన్ల మధ్య మాచుక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు మంగళవారం అర్ధరాత్రి 11.45 ప్రాంతంలో పట్టాలు తప్పాయని తెలిపారు. ముందుగా ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఆ తర్వాత 11.45 గంటలకు అదే మార్గం మీదుగా వచ్చిన జనతా ఎక్స్ప్రెస్ సమాచారలోపంతో పట్టాలు తప్పింది. జనతా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 5 బోగీలు నదిలో పడిపోయాయి. ఈ ఘోర రైలు ప్రమాదంలో 30 మంది మరణించారు.
300 మందిని కాపాడిన స్ధానికులు, రైల్వే సిబ్బంది:
నదిలో పడిపోయిన రెండు రైళ్లకు సంబంధించిన 15 బోగీలలో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులను కాపాడినట్లు రైల్వే, సహాయ అధికారులు చెబుతున్నారు. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న పలువురిని స్థానికులు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది కాపాడారని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, ఆ ప్రవాహంలో 50 నుంచి 60 మంది వరకు కొట్టుకపోయారంటూ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ రెండు రైలు ప్రమాదాలతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్-కోట మీదుగా మళ్లించారు.
పట్టాలు తప్పిన బోగీల్లోకి వరద నీరు చేరడంతో మృతుల సంఖ్య మరితంగా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రైల్వే శాఖ రూ. 50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.