దూకుడుగా పళనిస్వామి.. వ్యూహాం మార్చి.. రేపే బలనిరూపణకు సిద్దం..
ఇక బలనిరూపణ విషయంలోను పళనిస్వామి కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇందుకోసం గవర్నర్ 15రోజుల గడువు ఇవ్వగా అంతదాకా వేచిచూస్తే.. ఎమ్మెల్యేలు పట్టు జారిపోయే అవకాశముందని పళనిస్వామి ముందే పసిగట్టారు.
చెన్నై: శశికళ-పన్నీర్ మధ్య వారానికి పైగా వార్ కొనసాగినా.. ఎమ్మెల్యేలను మాత్రం తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ సెల్వం విఫలమయ్యారు. దీంతో పళనిస్వామికి పట్టం కట్టడం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం రెండూ పూర్తయిపోయాయి.
సీఎం పళనిస్వామి తీరు చూస్తుంటే పన్నీర్ లా నెమ్మదస్తుడి మాదిరి కాకుండా దూకుడుగా తన ఎదుట ఉన్న సవాళ్లన్నింటికి చెక్ పెట్టుకుంటూ వెళ్లే యోచనలో ఉన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడమే ఆలస్యం పన్నీర్ సెల్వంకు ఉన్న బుగ్గకారును, ఆయన ఇంటివద్ద ఉన్న భద్రతను తొలగించేశారు.
అంతేకాదు, సీఎంగా బాధ్యతలు చేపట్టడంలోను కీలక శాఖలైన హోంశాఖ, ఆర్థికతో పాటు మరో 19శాఖలను పళనిస్వామి ఆయన చెంతే పెట్టుకున్నారు. దీన్నిబట్టి కీలక వ్యవహారాల్లో ఏమాత్రం వేరొకరికి ఛాన్స్ ఇవ్వవద్దన్న ఆలోచనలో పళనిస్వామి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బలనిరూపణ విషయంలోను పళనిస్వామి కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇందుకోసం గవర్నర్ 15రోజుల గడువు ఇవ్వగా అంతదాకా వేచిచూస్తే.. ఎమ్మెల్యేలు పట్టు జారిపోయే అవకాశముందని పళనిస్వామి ముందే పసిగట్టారు. ఈ మేరకు శనివారం నాడే బలనిరూపణకు సిద్దం కావాలని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.
శనివారం నాడు బలనిరూపణకు వీలుగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.మరోవైపు పన్నీర్ సెల్వం మాత్రం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని సవాల్ చేశారు. ఈరోజు మద్దతుదారులతో కలిసి ఆయన భారీ ర్యాలీ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యేలందరిని పళనిస్వామి మళ్లీ రిసార్టుకే చేర్చారు. శనివారం నాడు అసెంబ్లీని సమావేశపరిస్తే.. వారందరిని నేరుగా రిసార్టు నుంచే అసెంబ్లీకి తరలించనున్నారు.