చెప్పుతో కొట్టినా విమానం ఎక్కొచ్చు.. మెత్తబడిన సర్కారు, నిబంధనల మార్పునకు యత్నాలు
విధి నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్ ను 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మళ్లీ విమానాలు ఎక్కించుకునే పరిస్థితి దాదాపు వచ్చేసింది.
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్ ను 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మళ్లీ ఎంచక్కా విమానాలు ఎక్కేయెచ్చట. పలు విమానయాన సంస్థలు ఆయనను ఎక్కించుకోవడానికి నిరాకరించి, అప్రకటిత నిషేధం విధించడంతో పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది ఎంపీలు ఆయనను వెనకేసుకొచ్చారు.
దాంతో మళ్లీ రవీంద్ర గైక్వాడ్ ను మళ్లీ విమానాలు ఎక్కించుకునే పరిస్థితి దాదాపు వచ్చేసింది. ఇందుకోసం ఏకంగా కొన్ని నిబంధనలు కూడా మార్చేస్తారట. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాలనుకున్న గైక్వాడ్ ను ఏకంగా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లను రద్దు చేశాయి. దీంతో ఆయన తప్పనిసరై రైల్లో వెళ్లాల్సి వచ్చింది.
ఎయిరిండియాకు చెందిన సుకుమార్ అనే 60 ఏళ్ల మేనేజర్ ను మెట్ల మీద నుంచి తోసేసి, చెప్పుతో కొట్టడాన్ని చాలా గర్వంగా చెప్పుకున్న గైక్వాడ్ క్షమాపణలు చెబుతామన్నా కూడా తమకు అవసరం లేదని విమానాయాన సంస్థలు గట్టిగా చెప్పాయి.
ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పినా, చివరికి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు బలవంతం చేయడంతో కొన్ని నిబంధనలు మార్చేందుకు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. 'ఎంపీలు కూడా ఇలా దొరికేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు..' అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్ సభలో వ్యాఖ్యానించారు.
అయితే, పార్లమెంట్ సభ్యుడు ప్రతిసారీ పార్లమెంట్ కు రావడానికి రైలు ఎక్కాలంటే కష్టంగా ఉంటుందని, అందువల్ల దీనిపై మరోసారి ఆలోచించాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. దీనిపై ఆమె మంత్రి అశోక్, శివసేన ఎంపీలతో 45 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రవీంద్ర గైక్వాడ్ చేసింది తప్పేనని శివసేన కూడా ఒప్పుకుందిగానీ, విమానాల్లో ఎక్కకుండా నిషేధించడం మరీ తీవ్రమైన నిర్ణయమంది. చివరికి శివసేన ఒత్తిడికి తలొగ్గిన సర్కారు ఎంపీని విమానాల్లో ఎక్కించుకునేందుకు వీలుగా సంబంధిత నియమ నిబంధనలను మారుస్తోంది.