వజ్రాల కంపెనీ: గాలిలో బెలూన్లు, ఉద్యోగులు జైలుకు
ముంబై: క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా సంతోషంతో గాలిలోకి బెలూన్లు ఎగరవేసి వినోదించిన ఇద్దరు చివరికి జైలుకు వెళ్లిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. ఇద్దరిని పోలీసు అధికారులు కస్టడికి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ముంబైలోని ధర్మానంద్ డైమండ్స్ ఎక్స్ పోర్ట్ కంపెనీ ప్రతినిధులు కునాల్ షా, నీలేష్ శ్రీమాన్కర్ అనే ఇద్దరిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ వీరేంద్ర తెలిపారు.
ఈ వజ్రాల ఎగుమతి కంపెనీ నిర్వహకులు వారి ఉద్యోగుల కోసం ఆదివారం కలీనా క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రికెట్ గ్రౌండ్ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఉంది. క్రికెట్ మ్యాచ్ పూర్తి అయిన తరువాత కేరింతలు కొట్టిన ఉద్యోగులు గ్యాస్ నింపిన హాట్ ఎయిర్ బెలూన్లను గాలిలోకి వదిలారు.
బెలూన్ల మీద కంపెనీ ప్రకటనలు వేశారు. ఆ బెలూన్లు చక్కగా ఎయిర్ పోర్టు ఆవరణంలోకి వెళ్లిపోయాయి. విషయం గుర్తించిన జెట్ ఎయిర్ వేస్, ఇండిగో పైలెట్ లు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరవేయడం వలన విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరవేయడానికి వీరు ముందుగా పోలీసుల నుండి అనుమతి తీసుకోలేదని సమాచారం. నిబంధనలకు విరుద్దంగా హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరవేశారని సెక్షన్ 336, సెక్షన్ 188ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.