ఎంజీఆర్ మేనల్లుడి హత్య:తీర్పు, తప్పించుకున్న ఎంజీఆర్ దత్తపుత్రిక
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మేనల్లుడు విజయన్ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఎంజీఆర్ దత్తపుత్రిక భాను నిర్దోషి అంటూ, మిగిలిన నిందితులకు యావజ్జీవ శిక్ష విదిస్తున్నామని కోర్టు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) మేనల్లుడు విజయన్ హత్య కేసులో ఐదు మందికి జీవితఖైదు శిక్ష విధిస్తూ చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది.
అయితే విజయన్ హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజీఆర్ దత్తపుత్రిక భానుమతి అలియాస్ భాను అలియాస్ భాను శ్రీదర్ కు కేసు నుంచి విముక్తి కల్పించారు. భాను స్నేహితురాలు, టీచర్ భువన ఎనిమిదేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతోంది.
ఎంజీఆర్ దత్తత తీసుకున్నారు
ఎంజీఆర్, జానకీరామచంద్రన్ దంపతులకు పిల్లలు లేరు. తన భార్య జానకీ సోదరుడి ఏడుగురు సంతానాన్ని ఎంజీఆర్ దత్తత తీసుకున్నారు. ఎంజీఆర్ ఆస్తుల కోసం వీరు పోటీ పడ్డారు. ముఖ్యంగా సుధా, భానుమతిల మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని ఆరోపణలు ఉన్నాయి.
సుధా, విజయన్
సుధా, విజయన్ దంపతులు వేరుగా, భానుమతి, శ్రీధర్ దంపతులు వేరుగా ఉండేవారు. ఎంజీఆర్ ఆస్తి కోసం వీరు పోటీ పడ్డారని సమాచారం. 2008 జూన్ 4వ తేదిన విజయన్ చెన్నైలోని అళ్వారు పేటలో దారుణ హత్యకు గురైనాడు.
కారుతో తొక్కించి, ఇనుప రాడ్లతో
విజయన్ ను కారుతో గుద్ది, ఇనుపరాడ్లతో దాడి చేసి అతిదారుణంగా హత్య చేశారు. అప్పట్లో అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. సుధా భర్త విజయన్ హత్య కేసులో ఆమె (సుధా) సొంత సోదరి భానుమతి అలియాస్ భాను శ్రీధర్ ను మొదటి ముద్దాయిగా చేర్చారు.
పోలీసు, టీచర్ సహాయంతో
అప్పట్లో సంచనం సృష్టిన విజయన్ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈకేసులో భానుమతి కానిస్టేబుల్ కరుణ అనే వ్యక్తికి రూ. 4 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో విజయన్ ను హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. వీరికి టీచర్ గా పని చేసి భువన అనే మహిళ సహకరించిందని విచారణలో వెలుగు చూసింది.
విదేశాలకు పారిపోయింది
విజయన్ హత్య జరిగిన వెంటనే టీచర్ భువన భయంతో విదేశాలకు పారిపోయింది. ఈ కేసులో వరుసగా భానుమతి, కానిస్టేబుల్ కరుణ, సురేష్, ఎస్. కార్తిక్, దినేష్ కుమార్, సాలమాన్, ఎం. కార్తిక్, భువనలను ముద్దాయిలుగా చేర్చారు.
ఎంజీఆర్ కుమార్తె భానుమతి సేఫ్
సోమవారం విజయన్ హత్య కేసు తుది తీర్పును చెన్నైలోని ప్రత్యేక కోర్టు వెల్లడించింది. భానుమతి, కార్తిక్ లను నిర్దోషులుగా గుర్తించి విడుదల చేస్తున్నామని కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో మిగిలిన కరుణ, సురేష్, కార్తిక్, దినేష్ కుమార్, సాలమాన్ లను నిందితులుగా గుర్తించి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్న టీచర్ భువన ఆచూకి తెలుసుకోవాలని పోలీసులకు సూచించింది.
మాకు న్యాయం జరిగింది
కోర్టు తీర్పు అనంతరం ఎంజీఆర్ దత్తపుత్రిక, విజయన్ భార్య సుధా మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తరువాత తన భర్త హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని, ఇప్పటికి మాకు న్యాయం జరిగిందని అన్నారు. అయితే సోదరి భానుమతి విషయంలో ఆమె పెద్దగా స్పందించలేదు. మొత్తం మీద ఎంజీఆర్ దత్తపుత్రిక భానుమతి నిర్దోషిగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.