మంగళగిరి టు చెన్నై గుండె రవాణా: మణికంఠ మృత్యుంజయుడు
చెన్నై: మృత్యువు సమీస్తున్నదని తెలుసుకున్న ఓ బాధితుడి కుటుంబ సభ్యులు మరికొందరైన ప్రాణాలతో ఉండాలని భావించారు. విషాదంలో ఉన్న ఆ కుటుంబం పెద్ద మనస్సు చూసి వైద్యులు సైతం చలించిపోయారు. వివరాలలోకి వెళితే ఇటివల విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మణికంఠకు తీవ్రగాయాలైనాయి. మణికంఠను మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు చికిత్స చేసినా మణికంఠ స్పందించలేదు. అతని బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు మణికంఠ బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. చెన్నైలోని ఫోర్టిస్ ఆషుపత్రిలో ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. మణికంఠ బ్రెయిన్ డెడ్ అయ్యిందని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు తెలుసుకున్నారు. వెంటనే మణికంఠ కుటుంబ సభ్యులను సంప్రదించారు.
మణికంఠ బతకడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెరాయి చేసుకుని అతని అవయవాలు దానం చెయ్యడానికి అంగీకరించారు. శుక్రవారం మద్యాహ్నం ఎయిర్ ఆంబులెన్స్లో మంగళగిరి చేరుకున్న చెన్నై ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు మణికంఠ గుండెను తీసుకుని ప్రత్యేక బాక్స్లో భద్రపరిచారు. అదేవిధంగా మణికంఠ లివర్, కిడ్నిలు, కళ్లు దానం చేశారు. ఎయిర్ ఆంబులెన్స్లో గుండెను చెన్నైకి తీసుకు వచ్చారు.
మరోవైపు, బెంగళూరులో గత నెల శివరాయ్ భాగి అలియాస్ సాయి (30) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న అతని బ్రెయిన్ డెడ్ అయ్యింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు బెంగళూరు చేరుకుని విక్టోరియా ఆసుపత్రి వైద్యుల సహకారంతో శివరాయ్ భాగికి ప్రత్యేక చికిత్స అందించి గుండెను తీసుకున్నారు. అనంతరం గుండెను ప్రత్యేక బాక్స్లో భద్రపరిచారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకు వెళ్లారు.
శివరాయ్ భాగి మహారాష్ర్టలోని సోలాపూర్కు చెందిన వాడు. ఇతను బెంగళూరు చేరుకుని ఎలక్ట్రానిక్ సిటిలోని జపాన్ మెటల్ సిస్టమ్స్ అనే కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటివల శివరాయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విక్టోరియా ఆసుపత్రికి తరలించగా అతను కోమాలోకి వెళ్లిపోయాడు. గతంలో బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రి నుండి చెన్నై ఫోర్టిస్ ఆసుపత్రికి ఇదే విదంగా గుండెను తీసుకు వెళ్లి మరోకరికి అమర్చారు.