గాలి జనార్ధన్ రెడ్డి కేసు: అలీకి బెయిల్ మంజూరు, విడుదల
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో మరో నిందితుడికి బుధవారం నాడు బెయిల్ లభించింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పీఏ అలీఖాన్కు బెయిల్ మంజూరైంది. బెయిల్ లభించడంతో ఆయన బెంగళూరు జైలు నుండి విడుదలయ్యారు.
కాగా, ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత గాలి జనార్ధన్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేస్తే అభ్యంతరం లేదని సిబిఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గాలికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బళ్లారికి వెళ్లరాదని, విదేశాలకు పోకూడదని సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డికి షరతులు విధించింది. ఆయన తన పాస్పోర్ట్ను అప్పగించాలని సూచించింది. బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ. 30లక్షల పూచీకత్తు సమర్పించాలని గాలిని ఆదేశించింది.
ఓఎంసీ కేసులో గాలి 2011 సెప్టెంబర్ 4న అరెస్టు అయ్యారు. మొత్తం ఏడు కేసుల్లో బెయిల్ లభించడంతో గాలి ఇక బయటకు రానున్నారు. గాలి ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
ఓఎంసీ కేసులో గాలి గత కొంత కాలం నుంచి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. గాలికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన అనుచరులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.