గాలి జనార్దన్ రెడ్డికి షాక్ : రూ. 24 కోట్ల ఆస్తి జప్తు చేసిన ఈడీ
బెంగళూరు: ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలైనాయి. జైలు నుండి విడుదల అయిన ఆయన మీద అధికారులు కన్ను వేశారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ. 24 కోట్ల ఆస్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జప్తు చేసింది.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ. 24 కోట్ల అక్రమ ఆస్తిని జప్తు చేశామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ జాయింట్ డైరెక్టర్ జాన్ కింగ్లి పీటీఐకి చెప్పారు. బళ్లారిలోని ఎఎంసీ మైనింగ్స్ లో జనార్దన్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మి అరుణ అక్రమంగా రూ. 24 కోట్లు సంపాదించారని వెలుగు చూసిందని, అందుకే జప్తు చేశామని ఆయన చెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి దంపతులకు చెందిన అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీకి చెందిన మూడు ఖాతాలను జప్తు చేశామని అన్నారు. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ. 62.09 కోట్ల అక్రమ ఆస్తిని తాము జప్తు చేశామని బెంగళూరులో జాన్ కింగ్లి పీటీఐకి వివరించారు.
అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేశారని ఆరోపిస్తూ గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మూడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి 2015 జనవరి 20వ తేదిన సుప్రీం కోర్టులో షరుతులతో కూడిన జామీను తీసుకున్నారు.
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి జనవరి 23వ తేది విడుదల అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారికి వెళ్లరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారి చేసింది.