చోరీ: సారీ అంటూ లెటర్, అవినీతి పోలీసుల వల్లే
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో దొంగతనం చేసిన దొంగలు.. అవినీతి పరులైన పోలీసుల బలవంతం కారణంగా ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని క్షమాపణ లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో నవ్రోజాబాద్ రాజధాని భోపాల్కు 512 కిమీ దూరంలో ఉంది. నవ్రోజాబాద్లో అక్టోబర్ 12న ఓ దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు దొంగతనం చేసిన తర్వాత కౌంటర్లోని చెక్క బోర్డుపై మార్కర్ పెన్తో ఓ లేఖను హిందీలో రాసి వెళ్ళారు.
తాము బలవంతంగానే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని, పోలీసులకు వారానికి రక్షణ డబ్బు చెల్లిచేందుకు దొంగతనాలు తప్పడంలేదని, తమను క్షమించాలని హిందీలో క్షమాపణ లెటర్ రాశారు.
తాము ఇలా దొంగతనాలకు పాల్పడడానికి కారణం సబ్ ఇన్ స్పెక్టర్ రమాకాంత్ పాండే, కానిస్టేబుళ్ళు రాహుల్ విశ్వకర్మ, ఆకాశ్ దాస్ లేనని లేఖలో తెలిపారు. వారికి ప్రతివారం డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేసి జైల్లో పెడతామని బెదిరిస్తారని వివరించారు.
మరో మార్గం లేకే ఈ షాపులో దొంగతనం చేశామంటూ 'సారీ' చెప్పారు. కాగా, దొంగతనం జరిగిన మరుసటి రోజు ఉదయం షాపు యజమాని రాజా వశ్వాని షట్టర్ తెరిచి చూడగా, దొంగతనం జరిగిన విషయం తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి పరిశీలించారు. ఇది ఒక్కడి పనికాదని, ఓ గ్యాంగు ఇందులో పాల్గొని ఉంటుందని పేర్కొన్నారు. రూ.25,000 నగదు, కిరాణా వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.
ఈ విషయంపై సబ్ ఇన్ స్పెక్టర్ రమాకాంత్ పాండే స్పందించారు. దొంగలు కావాలనే నా పేరు చెడగొట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఇలా చేశారని చెప్పారు. దొంగతనానికి పాల్పడిని వారు మీ ముగ్గురి పేర్లు మాత్రమే ఎందుకు రాశారు అన్న ప్రశ్నకు గాను మేము దొంగలను పట్టుకుంటాం కాబట్టి మా నుంచి తప్పించుకునేందుకు ఇదొక ఎత్తుగడ అని అన్నారు.