హిమాలయాలు: గంగోత్రి పుణ్యక్షేత్రం మూసివేత
డెహ్రడూన్: హిమాలయాలలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం గంగోత్రిని మూసివేశారు. శీతాకాలం ప్రారంభం అవుతున్న సందర్బంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా గంగోత్రి ఆలయాన్ని గురువారం మూసి వేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయా పర్వతాలలో గంగోత్రి పుణ్యక్షేత్రం ఉంది.
సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో గంగోత్రి దేవాలయం ఉంది. శీతాకాలంలో మంచు విపరీతంగా పడుతుంది. అందువలన గంగోత్రి దేవాలయం పూజారులు, అధికారుల సమక్షంలో గురువారం 1.15 గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయానికి తాళం వేశారు.
ఈ సందర్బంలో గంగోత్రి దేవాలయంలో 700 మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ లోని హిమాలయాలలో నాలుగు ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో బంద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేథార్ నాథ్ దేవాలయాలు ఉన్నాయి.
హిందువులు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను చార్ ధామ్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు గంగోత్రి దేవాలయాన్ని మూసి వేశామని, మిగిలిన మూడు పుణ్యక్షేత్రాలను త్వరలోనే మూసివేస్తామని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.