తెల్లతోలు వల్లే, నైజీరియన్ని పెళ్లాడితే: సోనియాపై కేంద్రమంత్రి వివాదాస్పదం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధఈ నైజీరియన్ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.
రాజీవ్ గాంధీ కనుక నైజీరియన్ను పెళ్లి చేసుకొని ఉంటే, ఆమెకు తెల్ల తోలు ఉండకపోయేదని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను లీడర్గా అంగీకరించేవారా అని వ్యాఖ్యానించారు. కాగా, గిరిరాజ్ సింగ్ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కూడా కామెంట్ చేశారు.
భగ్గుమన్న కాంగ్రెస్
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఆయన జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని మండిపడింది. సోనియా పైన అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు బీజేపీ మైండ్ సెట్ను తెలియజేస్తున్నాయన్నారు.
ఇదే మొదటిసారి కాదు..
గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే గిరిరాజ్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.