తుపాకి గురిపెట్టి రేప్ చేశాడు, పోలీసుల పట్టించుకోవడం లేదు: బాధితురాలు
న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టేందుకు వెళ్తే పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని గుర్గావ్కు చెందిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 23వ తేదీన ధరమ్ వీర్ థక్రాన్ అనే భూస్వామి అర్థరాత్రి సమయంలో తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి తుపాకీని తలకు గురి పెట్టి చంపేస్తానని బెదిరించి లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది.
ఆ విషయం ఎవరితోనైనా చెప్తే ప్రాణాలతో ఉండవని హెచ్చరించి మళ్లీ రెండు రోజుల తర్వాత వచ్చి తిరిగి అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె మీడియాతో చెప్పింది. తొలుత స్టేషన్కు వెళ్లినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని చెప్పిన పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ కేసు పురోగతి గురించి ప్రశ్నించేందుకు వెళ్తే అవతలికి పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆమె అన్నారు.
తాను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫిర్యాదు తీసుకోబోనని, నువ్వెంత తిరిగినా నీ పని కాదని అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్న కారణంగా పోలీసులు అతడి ప్రలోభాలకు లొంగుతున్నారని ఆమె ఆరోపించింది.
నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం లేదని బాధితారులు చేసిన ఆరోపణను పోలీసులు ఖండిస్తున్నారు. తాము కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.