ఉద్యోగమిస్తామని చెప్పి.. యువతిపై స్కూల్లో గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని 17ఏళ్ల యువతిని తీసుకెళ్లిన ఇద్దరు దుండగులు ఓ ప్రైవేట్ పాఠశాలలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే ఓ యువతి (17)కి నిందితుల్లో ఒకరైన స్క్రాప్ డీలర్ రమేష్ ఏడాది నుంచి తెలుసు. అతడు ఆమెకు ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆ స్కూలులోకి తీసుకెళ్లాడు.
స్కూలు సెక్యూరిటీ గార్డు గోవింద్.. రమేష్కి బాగా తెలిసున్నవాడు కావడంతో.. లోపలకు వెళ్లడానికి కూడా వాళ్లకు ఎలాంటి అడ్డు లేకపోయింది. తాను ఓ టీచర్ను తీసుకొస్తానని, ఆయనే ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి ఆఫీసు గది వద్ద ఉండాలని అతడు చెప్పాడు.
పావుగంట తర్వాత సెక్యూరిటీ గార్డుతో తిరిగొచ్చిన రమేష్.. గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. గట్టిగా అరిచేందుకు ప్రయత్నించగా వాళ్లు పారిపోయారు.
ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి జగత్పురి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షలకు పంపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా, వేసవి సెలవులు కావడంతో ఆ స్కూల్ ఇంకా తెరవలేదని చెప్పారు.