రేప్ బాధిత బాలిక ఆత్మహత్య: కడియాల కోసం కాళ్లు నరికేశారు
జైసల్మేర్: అత్యాచారానికి గురైన ఓ 13ఏళ్ల బాలిక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాయిమల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
నిందిత యువకుడు ఆత్మారాం(22)ను శ్రీగంగానగర్ జిల్లాలోని అతడి గ్రామంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 29న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.
ఆ తర్వాత ఘటన పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత బాలిక, ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మే 3న బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు, నిందితుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కాలు నరికి కడియాలు దోచేశారు
రాజస్థాన్ ఉదయపూర్ లోని సాక్దోరా గ్రామంలో దొంగలు ఘాతుకానికి తెగబడ్డారు. ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆమెను హత్య చేయడంతో పాటు ఆమె కాలు నరికి వెండి కడియాలు దోచుకెళ్ళారు. ఈ ఘటనను చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కాలికున్న కిలో వెండి కడియాల కోసమే ఆ దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరిగా ఉంటున్న ఉదీబాయి యోగక్షేమాలు తెలుసుకునేందుకు పొరుగువారు ఆమె ఇంటికి వెళ్లారు. రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్నిగమనించి ఆందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజయ్ లంబా తెలిపారు.