ఆ రేపిస్టును పెళ్ళి చేసుకోను: పోలీసులకు యువతి ఫిర్యాదు
వారణాసి: తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని తాను వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పిన, ఆ యువతి నిందితుడ్ని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ పెద్దలు ఓ వైపు వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకుండా అతడ్ని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో చోటు చేసుకుంది.
ఫిబ్రవరి 21న జాన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని సజోయి గ్రామానికి చెందిన యువతిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతి ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఇరువైపు కుటుంబాలు బాధితురాలు, నిందితుడి వివాహాన్ని నిశ్చయించారు. అయితే నిందితుడు కూడా ఈ వివాహానికి నిరాకరించాడు.
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యదు చేసింది. ఫిబ్రవరి 25న నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ కేసును ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరువర్గాల వారిపై ఒత్తిడి తెచ్చారు. కాగా, కుల పెద్దల ఒత్తిడి మేరకు నిందితుడు ఆమెతో వివాహానికి ఒప్పుకున్నాడు. దీంతో బాధిత యువతి అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే మార్చి 24న వీరిద్దరికి వివాహం చేసేందుకు నిశ్చయించారు.
వివాహ ఏర్పాట్లు జరుగుతుండగానే బాధిత యువతి పోలీసులకు ఫోన్ చేసి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో చేసేదేమి లేక పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.