ట్విస్ట్: మరోసారి అవకాశమివ్వండి, నా బలాన్ని చూపిస్తా, పళినికి చెక్ పెట్టేనా?
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొనేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు.
చెన్నై:అసెంబ్లీలో బల నిరూపణకు మరోసారి అవకాశం ఇవ్వాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు.శనివారం నాడు అసెంబ్లీలో చోటుచేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విన్నవించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొన్నారు.అయితే అసెంబ్లీలో చోటుచేసుకొన్న పరిణామాలు విస్తుపోయేలా చేశాయి.
అసెంబ్లీలో ఎంఏల్ఏలు బాహా బాహీకి దిగారు. అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. డిఎంకె రహాస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టింది.ఈ విషయమై ఎంఏల్ఏలు అసెంబ్లీలో గొడవకు దిగారు.
స్పీకర్ ధనపాల్, విపక్ష నేత స్టాలిన్ చొక్కాలు కూడ చిరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే 122 మంది ఎంఏల్ఏల మద్దతుతోనే పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు.
అయితే డిఎంకె సభ్యులు గవర్నర్ ను కలిశారు. ఆ తర్వాత మెరీనాబీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ నిరహారదీక్షకు దిగారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. శనివారం రాత్రి వరకు చెన్నైలో హైడ్రామా చోటుచేసుకొంది.
ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా ఆదివారం నాడు మరోసారి పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. మరో సారి అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు.