ఇండియా-పాక్ మధ్య అణయుద్దం జరిగితే! భారీ మూల్యం తప్పదు
న్యూఢిల్లీ : భారత్-పాక్ దాయాది దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య అణుయుద్దం జరిగితే..! అన్న సందేహాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. కాగా, ఒకవేళ రెండు దేశాల మధ్య అలాంటి పరిస్థితే గనుక తలెత్తితే ప్రపంచం మొత్తం దానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇండియా పాకిస్తాన్ గనుక 15కిలో టన్నుల పరిమాణం ఉన్న 100 న్యూక్లియర్ బాంబులతో (హిరోషిమా బాంబు) యుద్దానికి దిగితే.. మొత్తం 21కోట్ల మంది ప్రజలు ఈ అణుయుద్దానికి బలైపోతారు. అంటే.. ఈ లెక్క రెండో ప్రపంచ యుద్దంలో చనిపోయినవారి లెక్కతో సమానం. అంతేకాదు.. అణుబాంబుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓజోన్ పొర కూడా సగానికి సగం దెబ్బతినే అవకాశం లేకపోలేదు.
అణుయుద్ద ప్రభావంతో.. అసలు వర్షకాలమనేదే లేకుండా పోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కూడా ఉనికిలో లేకుండా పోయే ప్రమాదముంది. 2007లో మూడు అమెరికన్ యూనివర్సిటీల అధ్యయనకారులు దీనిపై పరిశోధన తేల్చి ఈ విషయాలను నిర్ధారించారు. కాగా, పాక్ పై యుద్దానికి భారత భద్రతా బలగాలు సై అంటుండడం.. అలాగే అధికార బీజేపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ కూడా అణుబాంబు ప్రతిపాదన తీసుకొచ్చారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.