నర్సులపై గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: 'ఎండలో ధర్నా చేస్తే గ్లామర్ పోతుంది'
పనాజీ: గోవా ముఖమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ధర్నా చేస్తున్న నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఎండలో సమ్మె చేస్తే గ్లామర్ పోతుంది. నల్లగా అయిపోతారు. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం" అంటూ పర్సేకర్ చేసిన వ్యాఖ్యలపై అటు నర్సులతో పాటు ఇటు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే, గోవాలో 108 సేవల నిర్వహణ కాంట్రాక్టును ఓ ప్రైవేట్ సంస్ధకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ నర్సులు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో 33 అంబులెన్స్ల స్ధానంలో 13 వాహనాలనే తిప్పుతూ ప్రభుత్వ ధనాన్ని దోచేస్తున్నారంటూ ప్రైవేట్ సంస్ధపై ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేసేందుకు నర్సులు సచివాలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా పర్సేకర్ నర్సుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే పర్సేకర్ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సీఎం కార్యాలయ వర్గాలు కొట్టి పారేశాయి. ఇక నుంచి ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతి సమావేశంలోనూ ఆందోళన నిర్వహించేందుకు తాము నిర్ణయించినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హృదయనాధ్ శిరోద్కర్ పేర్కొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.