భర్తల కంటే మహిళలకు అవే మక్కువ, మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
గోవా సాంస్కృతిక శాఖమంత్రి దయానంద్ మంద్రేకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భర్తల కంటే సీరియల్స్ ఎక్కువయ్యాయని మహిళలనుద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
పనాజీ :టివిల్లో వచ్చే సీరియల్స్ లో మునిగి మహిళలు భర్తలకు ఏం కావాలో పట్టించుకోవడం మానేశారని, గ్రామ సంస్కృతి, సంప్రదాయాల్లో కూడ పాల్గొనడం మర్చిపోయారని గోవా పర్యాటకశాక మంత్రి దయానంద్ మంద్రేకర్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమయ్యాయి.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మహిళలను కించపర్చే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆ పార్టీ విమర్శించింది.
సాయంత్రమైతే మహిళలు టివిలకు అతుక్కుపోతారని, పనిచేసిన అలసిపోయిన ఇంటికి వచ్చిన భర్త కష్ట,సుఖాలను పట్టించుకొనే పరిస్థితి కూడ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం కాఫీ కావాల అని ఇంటికి వచ్చిన భర్తను అడగకుండా సీరియల్స్ చూడడంలోనే మహిళలు లీనమౌతారని ఆయన చెప్పారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తలకు ఏం కావాలో పట్టించుకోరని చెప్పారు.టివిలో అనేక మంచి కార్యక్రమాలు వస్తోన్నా, సీరియల్స్ తప్పా, ఇతర కార్యక్రమాలను మహిళలు పట్టించుకోవడం మానేశారని ఆయన అన్నారు. విద్యుత్ కోత కారణంగానో ఇతర కారణాల వల్లో ఒక్కరోజు సీరియల్ చూడకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడుతారని ఆయ చెప్పారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే గ్రామ స్థాయి కార్యక్రమాల్లో కూడ పాల్గొనడం మానేశారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపర్చేవిధంగా ఉన్నాయని ఆ పార్టీ మంత్రి వైఖరిపై మండిపడింది.మహిళలంటే బిజెపి నాయకులకు ఏ పాటి గౌరవం ఉందో మంత్రి మాటలను బట్టి తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపింది.