భారతదేశంలో తొలి టెర్రరిస్టు నాధూరాం గాడ్సే: అజాం ఖాన్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన హంతకుడు నాధూరాం గాడ్సేను ఆర్ఎస్ఎస్ నేతలు కీర్తించడాన్ని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, మంత్రి అజాం ఖాన్ తప్పుబట్టారు. దేశంలో తొలి టెర్రరిస్టు అతడేనని విమర్శించాడు.
జాతి పిత గాంధీని చంపిన వ్యక్తిని కొనియాడడాన్ని ఆర్ఎస్ఎస్ కట్టిపెట్టాలని అన్నారు. ఇది ఇలా ఉంటే మత మార్పిడిల అంశంపై ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించారు.
ప్రధాని మోడీ అలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోరని అన్నారు. మోడీ అజెండా వేరని తెలిపారు. మత మార్పిడిల అంశంపై మోడీ నిశ్సబ్ధం వీడాలని... లేకుంటే ఆయన మౌనం ఇతర నేతలకు ప్రేరణలాగా మారుతుందని అజాం ఖాన్ అన్నారు.
ఉత్తర ప్రదేశ్లో రామమందిరం నిర్మాణం జరగాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్పై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. ఇక, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సే ప్రతిమలను నిలబెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్ర ప్రకాశ్ కౌశిక్ కోరిన విషయం తెలిసిందే.