రిసార్ట్ బార్లోనే ఎక్కువగా గడిపిన ఎమ్మెల్యేలు, వారిపై తిట్ల దండకం
పది రోజుల పాటు గోల్డెన్ బే రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువగా రిసార్టులోని బార్లోనే గడిపారని యాజమాన్యం తెలిపింది.
చెన్నై: పది రోజుల పాటు గోల్డెన్ బే రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువగా రిసార్టులోని బార్లోనే గడిపారని యాజమాన్యం తెలిపింది. మాజీ సీఎం పన్నీరు సెల్వంకు పార్టీ అధినేత్రి శశికళకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
శశికళకు మరో షాక్: భర్త కూడా జైలుకెళ్లక తప్పదా? ఇదీ కేసు?
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పీఠం తనకు లేదా తన వర్గం నేత పళనిస్వామికి దక్కేలా.. చిన్నమ్మ శశికళ పావులు కదిపింది. ఇందుకోసం తనవర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది. ఈ రిసార్టులో ఎమ్మెల్యేలు పదిరోజులు ఉన్నారు. అయితే, ఎక్కువ సమయం వారు బార్లోనే గడిపారని రిసార్టు యాజమాన్యం తెలిపింది.
అద్దె చెల్లించలేదు
ఎమ్మెల్యేలు తాము బస చేసిన గోల్డెన్ బే రిసార్టుకు అద్దెకు చెల్లించలేదు. ఈ అద్దె చెల్లించే వారికోసం యాజమాన్యం గాలిస్తోంది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం మూడు బస్సుల్లో ఈ రిసార్టుకు చేరుకున్న ఎమ్మెల్యేలు 18వ తేదీ శనివారం ఉదయం వరకు అక్కడే ఉన్నారు.
రూ.60 లక్షల బిల్లు
ఈ పది రోజులకు మొత్తం రూ.60 లక్షలు అయినట్టుగా రిసార్టు మేనేజ్మెంట్ బిల్లు ఇచ్చింది. కానీ, కేవలం రూ.5 లక్షల బిల్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.55 లక్షల అద్దెను రాబట్టుకోవడం ఎలాగో తెలియక రిసార్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది.
ఆ తర్వాత రిసార్టులో రద్దీ తగ్గింది
సాధారణంగా ప్రతి శని, ఆదివారాల్లో రద్దీగా ఉండే ఈ రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బసతో పదిరోజుల పాటు కళకళ లాడింది. అదే సమయంలో ఈ రిసార్టుకు వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గింది. అంతేకాకుండా, ఈ రిసార్టులో ఉన్న కిచెన్, గదులు అతి తక్కువమందికి మాత్రమే సరిపడ ఉన్నా యి.
ఎమ్మెల్యేల తిట్ల దండకం
కానీ, ఎమ్మెల్యేలు సహా వెయ్యిమంది బస చేయడంతో వారు కోరిన ఆహార పదార్థాలను తయారు చేసేందుకు రిసార్టులోని కిచెన్ 24 గంటల పాటు పని చేయాల్సి వచ్చింది. ఒక వేళ ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు ఆలస్యమైతే రిసార్టు వెయిటర్లను ఎమ్మెల్యేలు దుర్భాషలాడినట్టు యాజమాన్యం చెబుతోంది.
ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మద్యం సేవించారు. దీంతో పుదుచ్చేరి నుంచి మద్యాన్ని ఈ రిసార్టుకు తీసుకొచ్చినట్టుగా చెబుతున్నారు.
2011లో నిర్మాణం
ఈ రిసార్టును 2011లో నిర్మించారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ భక్తవత్సలం దీన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈయన కూవత్తూరు గ్రామంలో మొత్తం 93 ఎకరాలను సేకరించారు.
పడిపోయిన రిసార్ట్ రేటింగ్
ఇందులో ఆరు ఎకరాల్లో ఈ రిసార్టును నెలకొల్పారు. గత రెండేళ్ళ క్రితం ఈయన చనిపోవడంతో అతడి కుమారుడు యోగేశ్వరన్ ఈ రిసార్టును నడుపుతున్నాడు. ఎమ్మెల్యేల కారణంగా ఈ రిసార్టు రేటింగ్ కూడా గూగుల్ సెర్చ్లో 4.2 నుంచి 1.2కు పడిపోయింది.
తాత్కాలిక మూసివేత
ఇదిలా ఉండగా, శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే శాసనసభ్యులకు బస ఏర్పాటు చేసి కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కూవత్తూర్లోని గోల్డెన్ బే రిసార్ట్స్ను నిరవధికగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
శాసనసభలో శనివారం ముఖ్యమంత్రి బలపరీక్షలో పాల్గొనేందుకు శాసనసభ్యులు ఉదయమే అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత కొద్దిసేపటికే నిర్వహణ పనులు చేపట్టేందుకు గానూ రిసార్ట్స్ను మూసివేసినట్లు తెలిపింది.