బలపరీక్ష రోజు తమిళనాడు అసెంబ్లీలో అసలేం జరిగింది!: రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక
అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించి తుది నివేదిక రాగానే.. దాన్ని పరిశీలించిన గవర్నర్.. అనంతరం రాష్ట్రపతికి పంపించారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి బలనిరూపణ సందర్బంగా సభలో ఎంతటి గందరగోళం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకె సభ్యులు అడుగడుగునా స్పీకర్ కు అడ్డుపడటంతో.. నానా గందరగోళం నడుమ పలుమార్లు వాయిదా వేస్తూ సభ నిర్వహించాల్సి వచ్చింది.
డీఎంకె ఆందోళనలతో ఏకంగా ఆ పార్టీ సభ్యులందరిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపించేసిన స్పీకర్.. మూజువాణి ఓటు ద్వారా పళనిస్వామి బలనిరూపణ పూర్తి చేశారు. అయితే అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన డీఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తన చిరిగిన చొక్కాను చూపిస్తూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య అసలు సభలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పలు నివేదికలను తెప్పించుకుని పరిశీలించారు. అయితే వాటి పట్ల సంతృప్తి చెందని గవర్నర్ మొత్తం ఘటనపై మరింత సమగ్రంగా వివరాలు కావాలని ఆదేశించారు.
ఈ మేరకు తుది నివేదిక రాగానే.. దాన్ని పరిశీలించిన అనంతరం రాష్ట్రపతికి పంపించారు. కాగా, పళనిస్వామి బలనిరూపణను రద్దు చేసి రహస్య ఓటింగ్ జరపాలని డీఎంకె నేత స్టాలిన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి బలపరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు డీఎంకే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహారదీక్షలు నిర్వహించారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు బుధవారం నాడు విచారించింది. సభలో జరిగిన వ్యవహారానికి సంబంధించి వీడియో ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. ఇక అక్రమాస్తుల కేసులో దోషిగా తేలినందునా.. ప్రభుత్వం పథకాలపై జయలలిత ఫోటోలు తొలగించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే జయ మృతిపై విచారణ జరిపిస్తామని స్టాలిన్ అన్నారు.