త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ తెస్తున్నాం: కేంద్రం
ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించేందుకు నిర్ణయించచడం జరిగిందని, దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చింది.
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించేందుకు నిర్ణయించచడం జరిగిందని, దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చింది. నోట్లను ప్లాస్టిక్ లేదా పాలిమర్ పూతతో తయారు చేయడం జరుగుతుందని పేర్కొంది.
ఈ నోట్లకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ పార్లమెంటుకు రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న పేపర్ నోట్లకు బదులు ఇకపై ప్లాస్టిక్ కరెన్సీని ముంద్రించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించేందుకు ఆర్బీఐ కసరత్తులను ఇప్పటికే మొదలు పెట్టింది. 2014, ఫిబ్రవరిలోనే ఒక బిలియన్ రూ. 10 ప్లాస్టిక్ నోట్లను దేశంలోని పలు నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. ఆ నగరాల్లో కొచ్చి, మైసూరు, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్లు ఉన్నాయి.
కాగా, ప్లాస్టిక్ నోట్లు సుమారు ఐదేళ్లపాటు మనుగడలో ఉండే అవకాశం ఉంది. అయితే, వీటిని నకిలీ చేయడం చాలా కష్టమే. ప్లాస్టిక్ కరెన్సీ.. పేపర్ కరెన్సీ కంటే స్పష్టత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి నోట్లను ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టడం జరిగింది.
డిసెంబర్ 2015లో ఆర్బీఐకి కొన్ని రూ. వెయ్యి నోట్లు అందాయి. వాటిలో సెక్యూరిటీ త్రెట్ లేదు. ఈ నోట్లు కరెన్సీ నోట్ ప్రెస్(సీఎన్పీ) నాసిక్ తయారుకాగా, ఈ నోట్ల తయారీకి సెక్యూరిటీ పేపర్ మిల్(ఎస్పీఎం), హోషంగాబాద్ నుంచి పేపర్ సప్లై జరిగింది. దీనిపై సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్(ఎస్పీఎంసీఐఎల్) విచారణ జరుపుతోందని మేఘావల్ తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై పెనాల్టీ ఛార్జీషీట్ జారీ చేసినట్లు చెప్పారు. ఇలాంటి తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని, మరోసారి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.