మహిళా ఎంపీ డ్యాన్స్, 30 సెకండ్లలో 3 కోట్లు వెదజల్లారు! వివరణ
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఓ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు సభ్యురాలు పూనంబెన్... ముప్పై సెకండ్లలో మూడు కోట్ల రూపాయల మేర జనాల పైన డబ్బులు వెదజల్లినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్, మరికొందరు డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో కరెన్సీ నోట్లు వారి పైన వెదజల్లారు.
పూనంబెన్ తొలుత ఖంబాలియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జామ్ నగర్ నుండి లోకసభకు పోటీ చేసి గెలిచారు. ఆమె వయస్సు 41. ఆమె తండ్రి నాలుగుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972 నుండి 1990 వరకు గెలుపొందారు.
జునాగఢ్ జిల్లాలోని భల్కా తీర్థ్లో ఎంపీ అయిన పూనంబెన్ భక్తులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ఆమె, ఆమెకు చెందిన వారు అర నిమిషంలో మూడు కోట్ల రూపాయలను వెదజల్లారని తెలుస్తోంది.
దీనిపై పూనంబెన్ మాట్లాడుతూ.. ఇది తమ సంప్రదాయమని చెప్పారు. ఆ డబ్బులు విరాళాల ద్వారా వచ్చాయని, అందుకే వాటిని అందుకోసమే ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో తానేమీ తొలిసారి పాల్గొనడం లేదన్నారు. అలాగే, తాను పాల్గొనడం ఇదే చివరిసారి కూడా కాబోదన్నారు.
ఇది డబ్బులు పంచడం కాదని, సంప్రదాయమన్నారు. గత వంద ఏళ్లుగా సౌరాష్ట్రలో ఈ సంప్రదాయం ఉందన్నారు. ప్రజలు ఇక్కడికి ఆధ్యాత్మిక భావనతో వస్తారన్నారు. విరాళాల ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల హాస్టళ్లు, గోశాలల నిర్మాణానికి ఉపయోగస్తామని చెప్పారు.