గుజరాత్ పాలిటిక్స్: బీజేపీ గూటికి శంకర్ సింగ్ వాఘేలా?
మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీని అనుసరించడం మానేశారని వదంతులు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్నది. గుజరాత్ రాష్ట్రంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీని అనుసరించడం మానేశారని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తన పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తిరస్కరించడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారని తెలుస్తున్నది.
గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా వాఘేలా తొలగించారని వార్తలు వచ్చాయి. తద్వారా 20 ఏండ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి గల అనుబంధాన్ని తుంచుకునేందుకు వాఘేలా సిద్ధం అయ్యారా? అన్న అనుమానాలు ఉన్నాయి.
అంతే కాదు ఒకనాడు తనను పార్లమెంట్కు పంపిన బీజేపీలోకి చేరడానికే నిర్ణయించుకున్నారా? అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ నుంచి దేశ ప్రదానిగా నరేంద్రమోదీ ప్రజాదరణ గల నాయకుడిగా ఉండటంతో ఆయన నాయకత్వాన్ని వాఘేలా ఆమోదిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎంగా పోటీలో లేనన్న వాఘేలా
కాంగ్రెస్ పార్టీ తరఫున గుజరాత్ లో పని చేసేందుకు పార్టీ హై కమాండ్ నుంచి అనుమతి కోసమే వాఘేలా ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వంతో అసంత్రుప్తిగా, నిరాశగా ఏమీ లేనని శంకర్ సింగ్ వాఘేలా తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం కూడా తాను పోటీ పడటం లేదని పేర్కొన్నారు. గమ్మత్తు ఏమిటంటే 1996లో అక్కడి కేశూభాయ్ పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నిలవడంతోపాటు శంకర్ సింఘ్ వాఘేలా నాయకత్వానికి మద్దతు పలికారు. దాని ఫలితంగానే రిసార్టులో క్యాంపు రాజకీయాలు నడిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. తర్వాత జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. మళ్లీ కేశూభాయి పటేల్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైనా ఎమ్మెల్యేల్లో అసంత్రుప్తి పెరిగింది. దీంతో మరో చీలికను నివారించేందుకు 2001లో నరేంద్రమోదీని సీఎంగా బీజేపీ నాయకత్వం ఢిల్లీ నుంచి గాంధీనగర్కు పంపింది. నాటి నుంచి నేటి వరకు గుజరాత్ లో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందిన బీజేపీ విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నది.
సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆలస్యమే
‘నేను ట్విట్టర్లో కొందరు నేతల వ్యాఖ్యలను అనుసరించకపోవడానికి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఇందులో రహస్యమేమీ లేదు' అని శంకర్ సింగ్ వాఘేలా తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని కనీసం ఏడాది ముందే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పార్టీ నాయకత్వం ముందు అటువంటి ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మేం ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం' అని వాఘేలా వ్యాఖ్యానించారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శంకర్ సింఘ్ వాఘేలా.. తొలి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.
తన ప్రజాదరణ గుర్తించలేదని పార్టీపై వాఘేలా ఆగ్రహం
గుజరాత్ సీఎం అభ్యర్థిగా 57 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 36 మంది శంకర్ సింఘ్ వాఘేలా అభ్యర్థిత్వాన్ని ముందుకు తేవాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏ నేత పేరును ప్రకటించబోదని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అశోక్ గెహ్లాట్ తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన పేరు సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడంతోపాటు తన ప్రజాదరణను గుర్తించడానికి నిరాకరించడంతో శంకర్ సింఘ్ వాఘేలా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని సమాచారం.
2017లోనూ బాపు ప్రభుత్వం ఏర్పాటుపై హోర్డింగ్లు
శంకర్ సింగ్ వాఘేలాను బీజేపీ 1970 నుంచి 1996 వరకు గుజరాత్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ప్రజల మనోభావాలను క్యాష్ చేసుకున్నది. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వడోదరలో మళ్లీ బాపు ప్రభుత్వం ఏర్పాటవుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వడోదరలోని కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ఫొటోతో కూడిన హోర్డింగ్తో ‘బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. 2017లో బాపు ప్రభుత్వం ఏర్పాటవుతుంది' అని వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. ఆయా హోర్డింగ్ల్లో వాఘేలాను ‘బాపు'గా సంబోధించడం ఆసక్తికర పరిణామం. ‘ఎవరూ ఈ పని చేశారో నిజంగా నాకు తెలియదు. బీజేపీ వారు చేసి ఉండవచ్చు. వడోదరలోని స్థానిక కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి ఈ హోర్డింగ్లు ఎవరేర్పాటు చేశారో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరాను' వాఘేలా పేర్కొన్నారు.