గురుదాస్పూర్: ఉగ్రవాదుల గ్లౌవ్స్ ‘మేడిన్ పాకిస్థాన్’
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు మరికొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఉగ్రవాదులు ధరించిన గ్లౌవ్స్పై ‘మేడిన్ పాకిస్థాన్' అనే అక్షరాలు రాసి ఉన్నాయి.
‘న్యూస్ డెయిలీ'లో వచ్చిన కథనం ప్రకారం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ ఉగ్రవాది ధరించిన గ్లౌవ్స్పై ‘మేడిన్ పాకిస్థాన్' అని ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనతో ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారనే భారత వాదనలకు బలం చేకూర్చాయి.
పాక్ నుంచి వచ్చిన లష్కరే తయ్యెబె(ఎల్ఈటి) ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు భారత్ అనుమానిస్తోంది. కాగా, అమెరికా ప్రభుత్వానికి చెందిన రాత్రి వేళల్లోనూ లక్ష్యాన్ని చూపించే పరికరాలను కూడా ఉగ్రవాదుల దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అఫ్ఘాన్లో దాడి సమయంలో ఉగ్రవాదులు ఈ పరికరాలను పొందినట్లుగా భావిస్తున్నారు.
ఇంతకుముందు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని స్పష్టం చేశారు. కాగా, పాకిస్థాన్ మాత్రం భారత ఆరోపణలు ఖండించింది. నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు లభించిన ఆధారాలను బట్టి ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు రుజువైంది.
కాగా, ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ ఎస్పీతోపాటు పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.