శెభాష్ రా చిన్నోడా.. : దెబ్బకు లంచగొండి సస్పెండ్
చెన్నై : అధికారుల లంచగొండితనం పట్ల ఆవేదన చెందిన ఓ బాలుడు వినూత్న శైలిలో నిరసన తెలిపాడు. తన తల్లిని లంచం డిమాండ్ చేసిన అధికారికి బుద్ది వచ్చేలాగా.. సదరు లంచావతారుడిని బజారుకీడ్చే ప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అజిత్ కుమార్ తండ్రి ఓ రైతు. గతేడాది ఫిబ్రవరిలో కిడ్నీ సంబంధింత వ్యాధితో ఆయన కన్నుమూశారు. దీంతో ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఆయన భార్య అధికారుల కాళ్లా వేళ్లా పడుతూ.. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో పరిహారం మంజూరు చేసేందుకు గాను మూడు వేలు లంచం అడిగాడో అధికారి.
దీంతో చేసేదేమి లేక పరిహారంగా వచ్చే రూ.12,500 కోసం ఆమె మూడు వేలను లచ్చంగా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదంతా చూసి తీవ్రంగా కలత చెందిన ఆమె కొడుకు అజిత్ కుమార్.. ఆ లంచగొండి అధికారి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. భిక్షాటన ద్వారా లంచం డబ్బులు అడుక్కునేందుకు సిద్దమయ్యాడు. దీంతో గ్రామస్తులంతా సదరు గ్రామాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. సదరు లంచగొండి అధికారి సస్పెండ్ అయ్యాడు. ఉన్నతాధికారుల చొరవతో ఆ కుటుంబానికి అందాల్సిన పరిహారం.. వారి బ్యాంకు ఖాతాలో సోమవారం జమయింది. ఏదేమైనా.. లంచగొండితనాన్ని ఏకిపారేసేలా సదరు బాలుడు చేసిన చర్యకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.