మోడీ నోట్ల రద్దు నిర్ణయం వెనక ఓ వ్యక్తి: అతనెవరు?
న్యూఢిల్లీ: దేశంలోని నల్లధనం, నకిలీ నోట్లను పూర్తిగా అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో దేశం కరెన్సీ కల్లోలమే ఏర్పడిందని చెప్పవచ్చు. 4,5 రోజులు సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. దేశంలోని నల్లధనం బయటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే నకిలీ నోట్లకు ఈ నిర్ణయం శరాఘాతమనే చెప్పవచ్చు.
రూ.500, 1000నోట్ల మార్పిడి: మీ26 ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇవే
కాగా, ప్రధాని మోడీ నిర్ణయం వెనక ఓ వ్యక్తి సూచన ఉందని తెలుస్తోంది. 9 నిమిషాలు మాట్లాడి మొత్తం నల్లధనంపై తీవ్ర ప్రభావం చూపించారు. అతనే పుణెకు చెందిన ఆర్థిక నిపుణుడు అనిల్ బోకిల్(ఆర్థక్రాంతి) నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలని సూచించారు. ఈ నోట్ల రద్దుతో నల్లధనం మొత్తం నిర్మూలించవచ్చని వివరించారు.
కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీని అనిల్ కలిశారు. ఈ సందర్భంగా నల్లధనాన్ని అరికట్టేందుకు పలు ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సూచనలు చేశారు. ప్రధాని ఇచ్చిన 9నిమిషాల సమయంలోనే ఆయన పూర్తిగా నల్లధనం ప్రవాహం, అరికట్టే చర్యలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత అతని సూచనలపై ప్రధాని మోడీ దాదాపు రెండు గంటలపాటు చర్చించారు.
అనిల్ బోకిల్ చేసిన ముఖ్య సూచనలు
1. దిగుమతి సుంకం మినహా, 56 విభిన్న పన్నుల వసూళ్లను నిలిపేయాలి
2. పెద్ద నోట్లు రూ. 1000, 500, 100 నోట్లను కూడా రద్దు చేయాలి.
3. అన్ని కార్యకలాపాలు బ్యాంక్(చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్లైన్ ) ద్వారానే జరగాలి.
4. రెవెన్యూ కలెక్షన్ కోసం సింగిల్ బ్యాంకింగ్ సిస్టమ్.
బోకిల్ ఈ సూచనలు ఇవ్వడానికి కారణం
1. భారతదేశంలో రోజులో సగటుగా రూ. 2.7కోట్ల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అదే ఏడాదిలో రూ. 800 లక్షల కోట్లు. కానీ, 20శాతం కార్యకలాపాలు మాత్రమే బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయి. మిగితా కార్యకలాపాన్నీ నగదు ద్వారానే సాగుతున్నాయి. దీంతో లెక్క తేలడం లేదు.
2. దేశంలో 78శాతం మంది ప్రజలు రోజుకు రూ. 20మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అందువల్ల వారికి పెద్ద నోట్లతో పెద్దగా అవసరం ఉండదు.