రూ.2వేల నోటులో 'చిప్'పై ఎందుకు వెనక్కి తగ్గారో తెలుసా?
రూ.2వేల నోటులో నానో చిప్ ను అమర్చాలనుకున్న మాట వాస్తవమేనని అయితే వ్యయభారంతోనే ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ అధికారి తెలిపారు.
బెంగుళూరు: నోట్ల రద్దు తర్వాత కొత్తగా విడుదలైన రూ.2వేల నోటులో నానో చిప్ ఉంటుందన్న ప్రచారం విస్త్రుతంగా జరిగిన సంగతి తెలిసిందే. అందులోని చిప్ శాటిలైట్ కు అనుసంధానం చేయబడి ఉంటుందని.. తద్వారా భారీ మొత్తంలో డబ్బు ఎక్కడ పోగుబడి ఉన్నా.. ఆర్బీఐకి సమాచారం తెలిసిపోతుందని వదంతులు వచ్చాయి.
ఆ తర్వాత ఈ వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని తేలిపోయింది. అయితే రూ.2వేల నోటులో నానో చిప్ ను అమర్చాలనుకున్న మాట వాస్తవమేనని అయితే వ్యయభారంతోనే ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ ఆసక్తికర ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ అధికారి ఒకరు బెంగుళూరులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చిప్ ఆలోచనపై ఎందుకు వెనక్కి తగ్గారో వివరిస్తూ.. వ్యయభారంతో పాటు చిప్ అమర్చిన నోట్లను స్కానింగ్ చేయడానికి స్కానింగ్ యంత్రాలు కూడా పెద్ద ఎత్తున అవసరం అవుతుండడంతో.. వీటి వ్యయ భారం భరించడం ఆర్థిక ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి ఈ ఆలోచనను విరమించుకున్నట్టు ఆర్బీఐ అధికారి తెలిపారు.