భలే మంచి చౌక బేరము: ద్విచక్ర వాహనాలపై భారీ డిస్కౌంట్!
భారత్ స్టేజ్-3(బీఎస్-3) ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి.
న్యూఢిల్లీ: భారత్ స్టేజ్-3(బీఎస్-3) ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఏప్రిల్ 1 తరువాత ఆ ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయా సంస్థలు ఆఫర్లకు తెరతీశాయి.
దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, హోండా స్కూటర్ ఇండియా గరిష్టంగా రూ.12,500 వరకు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించాయి. వీలయినన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లు ప్రకటించాయి.
ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్ గరిష్టంగా రూ.12,500 తన బీఎస్-3 వాహనాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. స్కూటర్లపై దాదాపు రూ.12,500, ప్రీమియం బైక్స్ పై రూ.7,500, ప్రాథమిక స్థాయి ద్విచక్ర వాహనంపై రూ.5000 వరకు ఆ సంస్థ రిబేటు ప్రకటించింది.
మరోవైపు హోండా మోటార్ సైకిల్స్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) సంస్థ దాదాపు అన్ని స్కూటర్లు, బైక్ లపై దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈనెల 31 వరకు ఈ ఆఫర్ వర్తించనుంది.