హే ప్రభు, ఇదేలా సాధ్యం: సభలో నవ్వులు పూయించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నవ్వులు పూయించారు. తన పేరును తానే చెప్పుకొని సభలోని వారిని నవ్వించారు. అత్యధికంగా రైళ్లు తిరుగుతున్న మార్గాల్లో సామర్థ్యం మెరుగుపరచాలనేది చాలా ముఖ్యమని, ఓ ప్రభు ఇది ఎలా సాధ్యం అని అన్నారు.
అనంతరం ప్రభువు సమాధానం చెప్పలేదని, మనమే ఎందుకు కృషి చేయకూడదని ఈ ప్రభు అనుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఆయన అలా అన్నప్పుడు అధికార, ప్రతిపక్షాలు ఒక్కసారిగా నవ్వాయి. మధ్యలో హిందీ కవితలను కూడా వినిపించారు.
అప్పర్ బెర్త్ల గురించి మాట్లాడుతూ.. అప్పర్ బెర్త్లను మరింత బాగా చేస్తామని, మిడిల్ బెర్త్లను మహిళలు, అలాగే తనలాంటి ముసలివాళ్లకు రిజర్వ్ అయ్యేలా చేస్తామని చెప్పారు. ఢిల్లీ - కోల్కతా మధ్య హయ్యర్ స్పీడ్ రైళ్లు ఉంటాయని, అప్పుడు తన పశ్చిమ బెంగాల్ స్నేహితులు వేగంగా ప్రయాణించవచ్చునని చెప్పారు.
నిధులు ఏమీ లేవని, ఉన్న వాటినే పూర్తి చేస్తామని, ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఏమీ చేయలేమని కేంద్ర సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అందరి అభ్యర్థనలను అధ్యాయనం చేస్తున్నామని ఈ సమావేశాల్లోనే వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.