అరగంట హైడ్రామాలో అసలేం జరిగింది?: వేదనిలయంలో దీప భర్తను కొట్టారా?..
ఇంతసేపు వెయిట్ చేయించారని ఓవైపు వాదిస్తూనే.. మరోవైపు దాడి గురించి దీప మాట్లాడటం దీనిపై స్పష్టత లేకుండా చేసింది. అసలు వేదనిలయం లోపల ఏం జరిగిందనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు
చెన్నై: జయలలిత మృతి తర్వాత ఆమె వేల కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుందన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజుల్లో రక్త సంబంధీకులెవరినీ ఆమె దగ్గరికి తీయకపోవడం.. చెంతనే ఉన్న నెచ్చెలి శశికళపై పలు అనుమానాలు ఉండటం.. ఆస్తులు ఎవరికీ దక్కుతాయనే విషయాన్ని మరింత రక్తి కట్టించాయి.
ఇంతలో శశికళ జైలు బాట పట్టడం.. అన్నాడీఎంకె రాజకీయాలు కకావికలమవడం.. అనిశ్చితికి మారుపేరుగా ఇంకా ఆ పార్టీ రాజకీయం పడుతూ లేస్తున్నట్లుగానే సాగుతోంది. పోయెస్ గార్డెన్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న శశికళ జైలు జీవితం గడుపుతుండటంతో.. జయలలిత ఇల్లు వేదనిలయాన్ని స్మారక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
పళనిసామి సంచలన నిర్ణయం: పోయెస్ గార్డెన్ లోని జయ బంగ్లా ! దీపా ఫైర్, నువ్వెవరు ?
ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడ దీపక్.. ఎలాగైన వేదనిలయాన్ని దక్కించుకోవాలని తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో ఒకటిగా ఉంటూ వచ్చిన దీప, దీపక్.. ఆదివారం నాడు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో పోయెస్ గార్డెన్ కు నిజమైన హక్కుదారులెవరూ? అన్న ఉత్కంఠ నెలకొంది.
మిత్రుడు రాజాతో కలిసి:
పోయెస్ గార్డెన్ ఎవరికీ దక్కాలనే విషయంపై చర్చించేందుకు తమ్ముడు దీపక్ పిలుపు మేరకు దీప అక్కడికి చేరుకున్నారు. మిత్రుడు రాజాను వెంటపెట్టుకుని అక్కడికి వచ్చారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. సరాసరి లోపలికి వెళ్లిపోయారు. అరగంటపాటు తమ్ముడితో భేటీ అయిన దీప.. ఆ తర్వాత హఠాత్తుగా అరుపులు, కేకలతో బయటకు పరుగు తీశారు.
మీడియా ఎంట్రీతో:
దీప బయటకు పరుగు తీసిన సందర్బంలో మీడియా ప్రతినిధులు లోపలికి వచ్చారు. దీప జుట్టు చెదిరిపోయి ఉండటం, ఆయాసపడుతూ నీరసంగా కనిపించడం మరింత ఉత్కంఠను రేపింది. ఆ సమయంలో దీప వెంట భర్త మాధవన్, మిత్రుడు రాజా కూడా ఉన్నారు. దీపపై తమ్ముడు దీపక్ దాడికి పాల్పడ్డాడన్న విషయం తెలియగానే.. క్షణాల్లో ఆమె మద్దతుదారులు అక్కడ దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు.
హత్య కుట్ర:
తన తమ్ముడు దీపక్.. తనను హతమార్చేందుకు కుట్ర పన్నాడని దీప ఆరోపించడం పెను సంచలనంగా మారింది. ఎవరో వ్యక్తి నీళ్లు తీసుకొచ్చే ఇస్తే.. ఆ నీళ్లు తాగి ఆమె కాస్త కుదుటపడింది. అప్పటికీ నీరసంగానే మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజులుగా దీపక్ తెస్తున్న ఒత్తిడి మేరకే తాను వేద నిలయానికి వచ్చినట్లు చెప్పారు.
దినకరన్ గురించి మాట్లాడవద్దని తనను బెదిరించారని, దాడి తర్వాత క్షణాల్లో పోలీసులు అక్కడికి రావడాన్ని బట్టి చూస్తే.. ఇదంతా ముందస్తు ప్లాన్ అన్న అనుమానం కలుగుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ మొత్తం తతంగంపై ప్రధానికి ఫిర్యాదు చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతానని అన్నారు.
ప్రాణ హాని, జయలలితను చంపేశారు:
దాడి తర్వాత తనకు తన భర్త మాధవన్ కు ప్రాణహాని ఉందని దీప ఆందోళన వ్యక్తం చేశారు. మిత్రుడు రాజా మీద తప్పుడు కేసులు పెట్టి వేధించే పనికి సిద్దమవుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, జయలలితను శశికళ, దీపక్ కలిసి చంపేశారని దీప మరో సంచలన ఆరోపణ చేశారు.
నీ ముఖం చూపించకు:
దీప వేదనిలయంలోకి వెళ్లిన అరగంట పాటు ఇద్దరి మధ్య భేటీ సాఫీగానే సాగినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ దీప బయటకు పరుగెత్తుకొచ్చారు. తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోకిరి, రాస్కెల్.. మాధశన్ మీద చేయి చేసుకుంటావా? ఇంకోసారి నీ ముఖం కూడా నాకు చూపించకు అంటూ మండిపడ్డారు.
ఇంతలో ఓ పోలీస్ అదికారి కల్పించుకుని.. మాధవన్ కు ఏమీ కాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అందరికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని దీప చెప్పారు. ఇంతలో ఓ వ్యక్తి వేదనిలయం వైపు వెళ్తుండగా.. ఇతనే దాడి చేశాడన్నట్లుగా ఆమె ఆరోపించారు.
ఏం జరిగిందో క్లారిటీ లేదు:
ఇంతసేపు వెయిట్ చేయించారని ఓవైపు వాదిస్తూనే.. మరోవైపు దాడి గురించి దీప మాట్లాడటం దీనిపై స్పష్టత లేకుండా చేసింది. అసలు వేదనిలయం లోపల ఏం జరిగిందనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మరోవైపు దీపక్ మాత్రం కూల్ గా స్పందించారు. తనకు, అక్కకు మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ప్రస్తుతం వేద నిలయం చుట్టూ పోలీస్ నిఘా కొనసాగుతోంది.