మనం అదృష్టవంతులం, వాళ్లూ ఊహించి ఉండరు, ఇండియానే పెద్ద దిక్కు: ప్రధాని మోడీ
ఎంతో అదృష్టవంతులం కాబట్టే నూట పాతిక కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులుగా పవిత్రమైన పార్లమెంటులో కూర్చుని ఉన్నామని, వారి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడ
న్యూఢిల్లీ: ఎంతో అదృష్టవంతులం కాబట్టే నూట పాతిక కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులుగా పవిత్రమైన పార్లమెంటులో కూర్చుని ఉన్నామని, వారి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
బుధవారం ఉదయం లోక్ సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, స్వాతంత్ర్య ఉద్యమాన్ని, ఉద్యమ నేతలను స్మరించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలై 75 సంవత్సరాలు గడిచాయని గుర్తు చేసిన ప్రధాని, ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
బ్రిటీష్ వారు కూడా ఊహించలేదు...
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ సహా ఎందరో మహా పురుషులు జైలు జీవితం గడిపారని ప్రధాని మోడీ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన తరువాత.. భారత స్వాతంత్ర్య పోరాటం అంతగా ఉద్ధృతమవుతుందని బ్రిటీష్ వారు కూడా ఊహించలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఏకతాటిపైకి రాగా, వారిని ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరూ ఆదర్శనీయులేనని ఆయన కొనియాడారు. గాంధీ పిలుపు చిన్నా, పెద్దలను ఏకం చేసిందని మోడీ పేర్కొన్నారు.
Recommended Video
కరేంగే యా మరేంగే...
జీవితంలో జరిగిన మంచి పరిణామాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, అటువంటివే మళ్లీ మళ్లీ జరగాలని కోరుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాను తన జీవితంలో ఇప్పటికీ ఇంకా తృప్తిని పొందలేదని, ఈ విషయంలో గాంధీ చూపిన 'కరేంగే యా మరేంగే' (సాధిద్దాం లేదా మరణిద్దాం) బాట తనకు ఆదర్శమని అన్నారు. మోడీ ప్రసంగం స్ఫూర్తిమంతంగా సాగగా, ఆసాతం బీజేపీ ఎంపీలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.
ఇండియానే పెద్ద దిక్కు...
ప్రపంచమంతా ఇప్పుడు అవకాశాల కోసం ఇండియా వైపు చూస్తోందని లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అగ్ర రాజ్యాలుగా పేరున్న దేశాలు సైతం ఇండియాతో స్నేహం కోసం ముందుకు వస్తున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ వృద్ధికి భారతదేశమే పెద్దదిక్కుగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
ఉద్యోగాలు మీరే సృష్టించండి...
భారత యువ శక్తి సత్తా అపూర్వమని, వారు తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. సుభాష్ చంద్రబోస్ నుంచి అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వరకూ ఎందరినో నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తోందని, ఓ ప్రధానిగా ఇది తనకు గర్వకారణమని మోడీ తెలిపారు. జీవన గమనంలో మంచి జీతం తీసుకునే ఉద్యోగం చేసేందుకు బదులుగా ఉద్యోగాలను సృష్టించే పనులను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకీ రండి...
యువతలో చట్టాల అతిక్రమణ పట్ల అవగాహన పెరిగిందని, సమాజంలోనూ చట్ట నిబంధనలను పాటించడం పెరుగుతోందని ఇది శుభ పరిణామమని తెలిపారు. మిగతా విభాగాల మాదిరిగానే రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా యువత ఆసక్తిని చూపాలని మోడీ కోరారు. భరతమాత ముద్దుబిడ్డలు ఇప్పుడు ఎన్నో దేశాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు.
మళ్లీ అలాంటి స్ఫూర్తి అవసరం...
దేశ ప్రజలంతా కలసి కట్టుగా నడిస్తే, భారతావని కంటున్న కలలు సాకారం కావడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. 1942 నుంచి 1947 మధ్య యువత స్వాతంత్రం కోసం ఎలా ఉద్యమించిందో, 2017 నుంచి 2022 వరకూ అదే స్ఫూర్తిని చూపించి దేశాభివృద్ధికి యువత కృషి చేసి, ఇప్పుడు కంటున్న కలలను నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2022 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న తన కోరికను నెరవేర్చేందుకు, తనతో పాటు ముందడుగు వేయాలని ప్రధాని కోరారు. ఈ ప్రయాణంలో జీఎస్టీ అమలు నుంచి తాము తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు తోడుగా నిలుస్తాయని తెలిపారు.