రైల్వే స్టేషన్లో బాంబు కలకలం: హడలెత్తిన ప్రయాణికులు
చండీగఢ్: రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టామని, అవి పేలిపోతాయని ఫోన్ చేసి పోలీసులు, ప్రయాణికులకు చెమటలు పట్టించిన సంఘటన హర్యానాలో జరిగింది. హర్యానాలోని అంబాల రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి అంబాల రైల్వేస్టేషన్ కు ఫోన్ చేశాడు. అంబాల రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టామని, కొన్ని నిమిషాలలో అవి పేలిపోతాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబు నిర్వీర్యదళం బృందాలు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ప్రయాణికులు అందరిని అక్కడి నుండి ఖాళీ చేయించారు. మొత్తం అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబు కనపడకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎవరో కావాలని ఫోన్ చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. గత వారం గురు దాస్ పూర్ జిల్లాలోని దీనా నగర్ సమీపంలో ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ మీద బాంబులు పెట్టిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో భారీ రైలు ప్రమాదాలు జరిగిన సమయంలోనే బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలించారు. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్న ఒకరి కుమారుడు బాంబు బెదిరింపు ఫోన్ చేశాడని తెలుసుకుని అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.