ఆ ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారు: రాజ్నాథ్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ ఉగ్రవాదుల దాడి ఘటనపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. ఉగ్రవాదులు రావి నది మీదుగా పాకిస్థాన్ నుంచి వచ్చారని స్పష్టం చేశారు.
దేశ భద్రతను తక్కువ అంచనా వేస్తే ధీటుగా సమాధానం చెబుతామని ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. పాక్ నుంచి మన దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయడానికే వచ్చారని, సరిహద్దు ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
మన దేశ శత్రువులు భారతదేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని రాజ్నాథ్ తెలిపారు.
కాగా, హోంమంత్రి ఈ ప్రకటన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో గందరగోళం సృష్టించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ఉగ్రవాద దాడిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తున్నారని డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్ పదే పదే చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.